'తండేల్' కోసం రాజు, బుజ్జితల్లి తీసుకున్నది ఎంతంటే..!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'తండేల్' సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 4 Feb 2025 6:54 AM GMTనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'తండేల్' సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కారణంగా అంచనాలు భారీగానే ఉన్నాయి. సాధారణంగా గీతా ఆర్ట్స్ నుంచి సినిమా అంటే మినిమం ఉంటుంది అనే నమ్మకంతో ప్రేక్షకులు ఉంటారు. కనుక ఆ నమ్మకంను నిలబెట్టుకునేందుకు బన్నీ వాసు చాలానే ఎక్కువ ఖర్చు చేసి ఈ సినిమాను నిర్మించారు. కార్తికేయ 2 సినిమా తర్వాత చందు మొండేటి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తండేల్ సినిమాలో శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులను గురించి చూపించబోతున్నారు. సినిమా కథలో 50 శాతం నిజం ఉంటే, మిగిలిన 50 శాతంను కల్పితంగా మేకర్స్ చెబుతున్నారు. పాకిస్తాన్ జైల్లో పడే ఇండియన్ జాలర్లను ఎలా కాపాడారు అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారు. నాగ చైతన్య సాధారణ కుర్రాడి నుంచి తండేల్(నాయకుడు)గా ఎలా మారాడు అనేది సినిమా కథగా చెబుతున్నారు. అల్లు అరవింద్ చెబుతున్న దాని ప్రకారం నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడట. ఇది ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. అంతే కాకుండా సాయి పల్లవి సైతం మరోసారి తన సత్తా చాటబోతుందని అంటున్నారు.
ఈ సినిమాలో నాగ చైతన్య తండేల్ రాజు పాత్రలో కనిపిస్తే, సాయి పల్లవి పక్కింటి అమ్మాయి తరహాలో బుజ్జి తల్లి పాత్రలో కనిపించబోతుంది. రాజు పాత్రలో కనిపించినందుకు గాను నాగ చైతన్య రూ.15 కోట్ల పారితోషికంను అందుకున్నాడని తెలుస్తోంది. ఇక సాయి పల్లవి సైతం ఈ సినిమాకు గాను అత్యధికంగా పారితోషికం అందుకుంది. సాధారణంగా తెలుగు కమర్షియల్ హీరోయిన్స్ రెండు నుంచి మూడు కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం బుజ్జి తల్లి పాత్ర కి ప్రాణం పెట్టినందుకు గాను ఏకంగా రూ.5 కోట్ల పారితోషికంను అందుకుందని తెలుస్తోంది.
దర్శకుడు చందు మొండేటి గత చిత్రం కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమాకు ఆయన సాలిడ్ చెక్ను అందుకుని ఉంటారు. ఇక పుష్ప 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆయన ఈ సినిమాకి గాను భారీ మొత్తంలో పారితోషికంను అందుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది అనే నమ్మకంతో భారీ పారితోషికాలు ఇవ్వడం మాత్రమే కాకుండా కొన్ని సీన్స్కి ఊహకు సైతం అందని భారీ ఖర్చు చేశామని మేకర్స్ చెబుతున్నారు. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన నేపథ్యంలో హిట్ టాక్ వస్తే భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. తాము పెట్టిన బడ్జెట్ రావాలంటే హిట్ టాక్ రావాల్సిందే అని బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.