Begin typing your search above and press return to search.

గవర్నర్‌ను కలిసిన నాగార్జున

సినీనటుడు నాగార్జున గురువారం గవర్నర్‌తో భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 7:46 AM GMT
గవర్నర్‌ను కలిసిన నాగార్జున
X

కొండా సురేఖ వ్యాఖ్యలతో ఒక్కసారిగా యావత్ సినీ ఇండస్ట్రీ భగ్గుమంది. మంత్రి వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ట్వీట్లు చేస్తూ వచ్చారు. నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. నాగచైతన్య-సమంతల విడాకుల అంశంపై మంత్రి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో కింగ్ నాగార్జున గవర్నర్‌ను కలువడం ఆసక్తికరంగా మారింది.

సినీనటుడు నాగార్జున గురువారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే.. ఆయన కలిసింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కాదండోయ్. మిజోరం గవర్నర్‌ను కలిశారు. గవర్నర్ అనారోగ్యం బారిన పడడంతో ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు కింగ్ వెళ్లి కలిశారు.

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ అయ్యారు. కొన్నిరోజులుగా హరిబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించడానికి నాగార్జున హరిబాబు ఇంటికి వెళ్లారు. నాగార్జున వెంట రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా వెళ్లారు.

గత నెల 9న హరిబాబు అస్వస్థతకు గురికాగా.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆయనకు హార్ట్ సర్జరీ అయింది. కొన్ని రోజుల పాటు ఆయనకు ఐసీయూలోనే వైద్యం అందించారు. ఆ తరువాత డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.