Begin typing your search above and press return to search.

ఫ్లాప్ దర్శకుల రేంజ్ ను పెంచుతున్న నాగ్ అశ్విన్!

కల్కి సినిమా సక్సెస్ కావడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు రాజమౌళి రేంజ్ లో గుర్తింపు అందుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 12:30 AM GMT
ఫ్లాప్ దర్శకుల రేంజ్ ను పెంచుతున్న నాగ్ అశ్విన్!
X

కల్కి సినిమా సక్సెస్ కావడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు రాజమౌళి రేంజ్ లో గుర్తింపు అందుకుంటున్నాడు. ప్రస్తుతం కల్కి సీక్వెల్ ను ఫినిష్ చేయడానికి ప్రణాళికలను రచించుకుంటున్నాడు. అయితే తను మాత్రమే ఎదగకుండా మంచి టాలెంటెడ్ ఉన్న వారిని కూడా ఎదిగేలా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ అంతకుముందు శేఖర్ కమ్ముల దగ్గర సహాయక దర్శకుడిగా రెండు సినిమాలకు వర్క్ చేశాడు.

ఇక ఎవడే సుబ్రహ్మణ్యం అనే మొదటి సినిమా తోనే మంచి దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విని దత్ అల్లుడిగా న్యూ జర్నీ స్టార్ట్ చేసి మరో రేంజ్ కు వెళ్ళిపోయాడు. మహానటి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కల్కి సినిమాతో వైజయంతి స్థాయిని కూడా వెయ్యి కోట్లకు పెంచాడు. అయితే ఇటీవల కాలంలో కొందరి దర్శకుల తలరాతను కూడా మార్చే ప్రయత్నం చేశాడు.

అందులో ఇద్దరు దర్శకులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు అని చెప్పవచ్చు. ముందుగా జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కు అంత మంచి విజయం రావడానికి ముఖ్య కారణం నాగ అశ్విన్. అనుదీప్ మొదట సురేష్ ప్రొడక్షన్లో పిట్టగోడ అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. డిజాస్టర్ కావడంతో రెండో అవకాశం ఎవరు ఇవ్వలేదు.

ఇక ఖాళీగా ఉన్న టైమ్ లో నాగ్ అశ్విన్ అతన్ని పిలిచాడు. పిట్టగొడ కంటే ముందే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో నాగ్ అశ్విన్ ఫోకస్ లో గుర్తు పెట్టుకున్నాడు. ఎప్పటికైనా అతనితో ఒక సినిమా నిర్మించాలి అని ఫిక్స్ అయ్యాడు. ఇక నాగ్ అశ్విన్ మహానటితో సక్సెస్ అందుకున్న తర్వాత స్వప్న సినిమాస్ లో జాతి రత్నాలు అనే సినిమాతో అతనికి అవకాశం ఇచ్చాడు.

ఇక జాతి రత్నాలు సినిమా పెట్టిన పెట్టుబడి కంటే నాలుగింతలు ఎక్కువ లాభాన్ని అందించింది. అనంతరం అనుదీప్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తర్వాత అతను శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమా చేశాడు. అది అంతగా ఆడకపోయినా ప్రస్తుతం అతనికి విశ్వక్ సేన్ తో ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఈ సినిమా గ్రాండ్ గానే తెరపైకి రాబోతోంది. ఈ విధంగా అతని తలరాతను నాగ్ అశ్విన్ మార్చేశాడు.

మరొక టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కెరీర్ కూడా ఊపందుకోవడానికి నాగ్ అశ్విన్ ఒక ముఖ్య కారణం. హను మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అయినప్పటికీ అతనికి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సరైన విజయాలు రాలేదు. లై - పడిపడి లేచే మనసు సినిమాలు కమర్షియల్ గా దెబ్బకొట్టడంతో మళ్ళీ అతనికి అవకాశాలు రాలేదు. ఇక హనుని పిలిపించి సీతారామంను స్వప్న సినిమాస్ లో రూపొందెలా చేశాడు.

సీతారామం సినిమాతో హను ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు అతను ఏకంగా ప్రభాస్ తో 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇతని కెరీర్ మారడానికి కూడా నాగ్ అశ్విన్ దోహదపడ్డాడు. అలాగే నందిని రెడ్డికి కూడా నాగ్ అశ్విన్ ద్వారానే ఒక అవకాశం వచ్చింది. అన్ని మంచి శకునములే అనే సినిమాను ఆమె స్వప్న సినిమాస్ లో చేశారు. కానీ ఆ అవకాశాన్ని నందిని సరిగ్గా వినియోగించుకోలేదు. ప్రస్తుతం మరి కొంతమంది టాలెంటెడ్ దర్శకులకు కూడా నాగ్ అశ్విన్ ద్వారా స్వప్న సినిమాస్ లో అవకాశాలు లభిస్తున్నట్లుగా తెలుస్తోంది