యాక్టింగ్ లోనే కొనసాగాలని అప్పుడే డిసైడయ్యా
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం.
By: Tupaki Desk | 15 March 2025 4:36 PM ISTఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం. మాళవికా నాయర్, రీతూ వర్మ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతీ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజై ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రీయూనియన్ ఏర్పాటు చేసి ఓ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో చిత్ర యూనిట్ తో పాటూ పలువరు పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ రీయూనియన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాని హీరోగా నటించగా, విజయ్ దేవరకొండ సపోర్టింగ్ రోల్ లో నటించాడు. ఈ సినిమా చూసినప్పుడే విజయ్ టాలెంట్ బయటపడింది. అందరూ విజయ్ పాత్రకు, యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు. ఇంకా చెప్పాలంటే విజయ్ లోని నటుడిని ఇప్పటివరకు సరిగ్గా వాడుకున్న వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ్ అశ్విన్ అనే చెప్పొచ్చు.
ఈ రీయూనియన్లో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవడే సుబ్రమణ్యంలో ఓ కీలక సీన్ గురించి చెప్తూ, తాను రిషిగా, నాని సుబ్బుగా మారిపోయి ఆ సీన్ ను కంప్లీట్ చేశామని, జీవితంలో యాక్టింగ్ లోనే కంటిన్యూ అవాలని ఆ సందర్భంలోనే నిర్ణయించుకున్నాని విజయ్ దేవరకొండ వెల్లడించాడు. విజయ్ మాట్లాడిన ఆ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ రీయూనియన్ లో మూవీలోని ఓ పోస్టర్ ను నాని, విజయ్ దేవరకొండ, మాళవిక రీ క్రియేట్ చేసి హల్చల్ చేశారు. మార్చి 21న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. గత కొంతకాలంగా నాని ఫ్యాన్స్ కు, విజయ్ ఫ్యాన్స్ కు మధ్య టైర్2 హీరోల్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని విమర్శలు చేసుకుంటూ ఉంటే, నాని, విజయ్ మాత్రం ఎలాంటి ఈగోలు లేకుండా సరదాగా ఫోటోలకు పోజులివ్వడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.