Begin typing your search above and press return to search.

శనివారానికి ఈ రన్‌టైమ్ సరిపోదా నానీ?

ఇప్పటికే ''సరిపోదా శనివారం'' సినిమా రన్‌టైమ్ లాక్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Aug 2024 7:45 AM GMT
శనివారానికి ఈ రన్‌టైమ్ సరిపోదా నానీ?
X

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''సరిపోదా శనివారం''. 'అంటే సుందరానికీ' తర్వాత వీరిదరో కాంబోలో రాబోతున్న సినిమా ఇది. ఈసారి క్లాస్ సబ్జెక్ట్ తో కాకుండా, వైవిద్యమైన మాస్ యాక్షన్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నెలాఖరున థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రన్‌టైమ్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.

ఇప్పటికే ''సరిపోదా శనివారం'' సినిమా రన్‌టైమ్ లాక్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. మూవీ లెన్త్ 155 నిమిషాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే నాని చిత్రం 2 గంటల 35 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రాబోతోందన్న మాట. ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు ఇది డీసెంట్ రన్‌ టైమ్ అని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో జనాలను చివరి వరకూ సీట్ లో కూర్చో పెట్టడానికి, మేకర్స్ క్రిస్పీ రన్ టైంను ఎంచుకోవడం సరైన నిర్ణయమని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఈ మధ్య కాలంలో ఏదైనా క్రేజీ మూవీ థియేటర్లలోకి వస్తుందంటే చాలు, అది 'పెద్ద సినిమా' అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే స్టార్ హీరోలు నటించే చిత్రాలన్నీ దాదాపుగా 3 గంటలకు పైగా రన్ టైంతో ఉంటున్నాయి. 'యానిమల్' మూవీ ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివితో వస్తే.. 'సలార్' 'కల్కి 2898 ఏడీ' లాంటి చిత్రాలు మూడు గంటల రన్‌టైమ్ తో ప్రదర్శించబడ్డాయి.

రీసెంట్ గా వచ్చిన 'భారతీయుడు 2' మూవీ 3 గంటలకు పైగా నిడివితో రిలీజ్ అయింది. అయితే రన్‌టైమ్ పై ట్రోల్స్ రావడంతో, చివరకు 12 నిమిషాలు ట్రిమ్ చేసారు. అంతెందుకు 'అంటే సుందరానికీ' సినిమా రన్ టైం దగ్గర దగ్గరగా మూడు గంటలు వచ్చింది. దీనికి నిడివి మైనస్ గా మారిందనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే నాని 'సరిపోదా శనివారం' సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా సరిగ్గా రెండున్నర గంటల రన్‌టైమ్ ను లాక్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

'సరిపోదా శనివారం' చిత్రం 2024 ఆగస్టు 29న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. అయితే రిలీజ్ కు ఇంకా మూడు వారాలే సమయం ఉన్నా, ఇంకా ప్రమోషన్స్ స్పీడ్ పెంచక పోవడంపై నాని అభిమానులు నిరాశ చెందుతున్నారు. మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సాంగ్స్, ట్రైలర్, ఇంటర్వ్యూలు.. ఇలా వరుసగా ప్రమోషనల్ కంటెంట్ వదలాలని రిక్వెస్టులు పెడుతున్నారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'సరిపోదా శనివారం' చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్.జె సూర్య విలన్ గా నటిస్తుండగా.. అదితి బాలన్, అభిరామి, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.