Begin typing your search above and press return to search.

సంచలన కేసును గుర్తుచేసిన పూనమ్!

సినిమాల్లో నటించకపోయినా నిత్యం ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   6 Jun 2024 9:59 AM GMT
సంచలన కేసును గుర్తుచేసిన పూనమ్!
X

ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సంచలన ట్వీట్స్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటుంది. సమాజంలో పలు విషయాలపై స్పందిస్తుంటుంది. సినిమాల్లో నటించకపోయినా నిత్యం ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

రెండు రోజుల క్రితం వెలువడ్డ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటీవల స్పందించింది. 'వై నాట్ 175' ను రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు' అని పోస్ట్ పెట్టింది. #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా యాడ్ చేసింది. అయితే గతంలో వైసీపీతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా పోస్టులు పెట్టింది పూనమ్. దీంతో లేటెస్ట్ పోస్ట్.. ఎవరిని ఉద్దేశించి పెట్టిందో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

తాజాగా పూనమ్ పెట్టిన మరో పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 2017లో ఏపీలో అనుమానాస్పదంగా మరణించిన సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పోస్ట్ చేసింది. బాధితురాలి తల్లికి న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది. కేసును త్వరగా పరిష్కరించాలని కోరింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆమె ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం.

2017లో కర్నూలు సిటీలో ఓ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆ సమయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొందరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితులంతా బెయిల్ పై విడుదల అయ్యారు. అప్పట్లో బాధితులకు న్యాయం జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో ఈ కేసుపై అందరి దృష్టి పడింది.

ఆ సమయంలో బాధితులకు న్యాయం చేస్తానని అప్పుడు సీఎంగా ఉన్న జగన్ హామీ ఇచ్చారు. రూ.8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలం ప్రభుత్వం ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించింది జగన్ ప్రభుత్వం. అయితే సుగాలి ప్రీతి మరణించిన ఘటన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పూనమ్ ఆ కేసును గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.