Begin typing your search above and press return to search.

పుష్ప 2 చూశా... అవార్డులన్నీ బన్నీకే!

నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ... ఇటీవల నేను అల్లు అర్జున్‌ డబ్బింగ్ చెబుతూ ఉంటే పుష్ప 2 సినిమాలోని రెండు సీన్స్ ను చూశాను.

By:  Tupaki Desk   |   14 Oct 2024 7:30 PM GMT
పుష్ప 2 చూశా... అవార్డులన్నీ బన్నీకే!
X

అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమా ఏమాత్రం ప్రమోషన్‌ చేయకున్నా ఏకంగా వంద కోట్లకు పైగా హిందీ మార్కెట్‌ నుంచి రాబట్టి సర్‌ప్రైజ్‌ చేసింది. పైగా కరోనా సమయంలో వంద కోట్లను హిందీ వర్షన్‌ ద్వారా రాబట్టడం ద్వారా ఉత్తరాది సినీ ప్రేమికులను సైతం ఆశ్చర్యపరిచింది. పుష్ప సినిమా భారీ వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ పుష్ప 2 పై అంచనాలు పెరిగి పోయాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు సుకుమార్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకుని సినిమాను చేయడం జరిగింది.

ఎట్టకేలకు పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల చివరి వరకు గుమ్మడికాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్నా కొద్ది ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడి సినిమా స్థాయిని పెంచేస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్‌ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నిర్మాత ఎస్‌కేఎన్‌ మీడియా ముందుకు వచ్చారు. 'ఘటికాచలం' సినిమా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై నిర్మాత ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ... ఇటీవల నేను అల్లు అర్జున్‌ డబ్బింగ్ చెబుతూ ఉంటే పుష్ప 2 సినిమాలోని రెండు సీన్స్ ను చూశాను. సినిమా విడుదల తర్వాత వరుసగా అవార్డులు దక్కించుకోవడం ఖాయం అనిపించింది. పుష్ప తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ రాబోయే ఏడు సంవత్సరాల్లో ఇండియాలో ఉన్న అన్ని అవార్డులను సొంతం చేసుకుంటారు అన్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ నటన పుష్ప 2 లో అద్భుతంగా ఉందని, కచ్చితంగా సినిమా రికార్డుల మోత మ్రోగించడం ఖాయం అనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశారు. ఎస్‌కేఎన్‌ వ్యాఖ్యలతో సినిమా గురించి మరోసారి చర్చ మొదలు అయింది.

దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న పాటలు ఇప్పటికే రెండు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. టీజర్ తోనే సినిమా గురించి జనాల్లో ఆసక్తి పెంచిన దర్శకుడు సుకుమార్‌ ఈసారి క్లైమాక్స్ ను దుమ్ము లేచి పోయే విధంగా రూపొందిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పుష్ప 2 సినిమా ను ఇండియన్‌ బిగ్గెస్ట్‌ సినిమాల జాబితాలో నిలిపేందుకు దర్శకుడు సుకుమార్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్‌ స్టార్‌ నటి ఐటం సాంగ్‌ ను చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.