Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞకు బయటి నిర్మాతలు దొరకలేదా?

ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ భార్య తేజస్విని నిర్మిస్తారని టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   29 July 2024 11:30 AM GMT
మోక్షజ్ఞకు బయటి నిర్మాతలు దొరకలేదా?
X

నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నటసింహం బాలకృష్ణ ఏకైక కుమారుడు హీరోగా తెరంగేట్రం చేస్తారని ఎన్నాళ్ళనుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అంటూనే ఉన్నారు కానీ, ఇంతవరకూ జరగలేదు. అయితే ఇప్పుడు మోక్షు డెబ్యూకి రంగం సిద్ధమైంది. 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ భార్య తేజస్విని నిర్మిస్తారని టాక్ నడుస్తోంది.

బాలయ్య కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్.. ఎట్టకేలకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సంబర పడుతున్నారు. డెబ్యూతోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చెయ్యాలని కోరుకుంటున్నారు. కాకపోతే టాలీవుడ్ లోని ఏదైనా పెద్ద బ్యానర్ లో లాంచ్ చేయకుండా.. ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మాతగా అనుభవం లేని సొంత సోదరి ప్రొడక్షన్ లో చేయడంపై అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞతో సినిమా చేయడానికి బయటి నిర్మాతలు సాహసం చేయడం లేదా? బాలకృష్ణ బయటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వడం లేదా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి బాలకృష్ణ కుమార్తె తేజస్వినీని తన 110వ సినిమాతోనే నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అఖండ 2' చిత్రానికి ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తారు. ఇదే క్రమంలో మోక్షజ్ఞ మొదటి సినిమాకి నందమూరి వారసురాలు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అయితే మరో రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకుంటారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు ప్రశాంత్ వర్మ సైతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో.. డైరెక్టర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటారేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

'జాంబిరెడ్డి' మూవీతో తేజ సజ్జాను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రశాంత్ వర్మ.. 'హనుమాన్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ క్రమంలో నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకుంటున్నారు. దర్శకుడు ఒక అద్భుతమైన మైథాలజికల్ సబ్జెక్ట్ రెడీ చేసారని, మహాభారతంలోని అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తారని టాక్స్ నడుస్తున్నాయి. అంతేకాదు ఇదే మూవీలో బాలకృష్ణ కూడా నటిస్తారని, తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూపించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయడానికి ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ కసరత్తులు చేసారు. బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకొని హీరో లుక్ లోకి వచ్చేసారు. ఇప్పటికే బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్ నట వారసులంతా తక్కువ వయసులోనే హీరోలుగా ఆరంగేట్రం చేశారు. నందమూరి ఫ్యామిలీకే చెందిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ల వయసులో హీరోగా లాంచ్ అయ్యారు. సెప్టెంబర్ 6వ తేదీ నాటికి మోక్షజ్ఞకు 30 ఏళ్ళు పూర్తవుతాయి. అదే రోజున తన డెబ్యూ ప్రాజెక్ట్ ను అఫీషయల్ గా అనౌన్స్ చేసి, బర్త్ డే స్పషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని టాక్ వస్తోంది. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.