Begin typing your search above and press return to search.

'పుష్ప 2' రిలీజ్ డేట్ మార్పు..!

నవంబర్‌ నుంచి సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను చేయడంతో పాటు, ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు

By:  Tupaki Desk   |   8 Oct 2024 5:34 AM GMT
పుష్ప 2 రిలీజ్ డేట్ మార్పు..!
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ చివరి వరకు పుష్ప 2 సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వబోతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించిన మేనేజర్‌ ఒకరు చెప్పుకొచ్చారు. నవంబర్‌ నుంచి సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను చేయడంతో పాటు, ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ విషయం పక్కన పెడితే పుష్ప 2 సినిమా షూటింగ్‌ ముగింపు వేళ సినిమా విడుదల తేదీలో మార్పు అనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ లో ఉత్సాహం నింపుతున్నాయి.

సినిమా విడుదల తేదీ మార్పు అంటే కచ్చితంగా ఫ్యాన్స్‌ కొన్ని రోజుల తర్వాత అనుకుంటారు. కానీ పుష్ప 2 విషయంలో అలా కాదు. ఒక రోజు ముందుగానే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొన్నటి వరకు డిసెంబర్‌ 6న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. కానీ ఒకటి రెండు రోజుల్లో సినిమాను డిసెంబర్‌ 5న విడుదల చేయబోతున్న అధికారిక ప్రకటన రాబోతుంది. ఇప్పటికే విడుదల అయిన పాటలకు మంచి స్పందన వచ్చింది. కనుక ఇక ముందు రాబోతున్న పాటలు సైతం సినిమా స్థాయిని అమాంతం పెంచడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పుష్ప 2 సినిమాను ఒక రోజు ముందుగానే విడుదల చేయాలి అనుకోవడానికి కారణం ఏంటి అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ పుష్ప 2 విడుదల తేదీ విషయంలో మాత్రం అతి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వెయ్యి కోట్ల మూవీ అంటూ ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను చాలా జాగ్రత్తగా దర్శకుడు సుకుమార్‌ రూపొందించారు. పుష్ప 2 లో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. మలయాళ స్టార్‌ ఫహద్ ఫాసిల్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.

రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కనుక ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధిస్తుంది అనే నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ఏకంగా రూ.450 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినా కచ్చితంగా సినిమా అనుకున్న దాని కంటే బెటర్‌ గా వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటి ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది అనే సమాచారం అందుతోంది.