Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి ఇలాంటి బ‌యోపిక్ తీస్తాడ‌నుకోలేదు!

జ‌క్క‌న్న ఒక గొప్ప చిత్రం రూప‌క‌ల్ప‌న‌లో భాగం కాబోతున్నారు. రాజమౌళి తన కొడుకు కార్తికేయ సహా ఒక నిర్మాణ బృందాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Sep 2023 2:45 AM GMT
రాజ‌మౌళి ఇలాంటి బ‌యోపిక్ తీస్తాడ‌నుకోలేదు!
X

భార‌తీయ సినిమా 100 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌ చ‌రిత్ర‌ను క‌లిగి ఉంది. మూకీ నుంచి టాకీ వ‌ర‌కూ.. అసాధార‌ణ విజువ‌ల్ ప్ర‌పంచాన్ని సృజించిన‌ ఎంద‌రో దిగ్ధ‌ర్శ‌కులు దేశంలో ఉన్నారు. నేడు భార‌తీయ సినిమా 1000 కోట్ల వ‌సూళ్లను సునాయాసంగా తాకుతోంది. ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌ను అందుకుని ఇండియ‌న్ డయాస్పోరాలో అద్భుత‌మైన ఫ‌లితాన్ని భార‌తీయ సినిమా అందుకుంటోంది. ఇటీవ‌ల ప్రాంతీయ సినిమా హిందీ సినిమా అనే విభేధాలు కూడా స‌మ‌సిపోయాయి. హెచ్చుతగ్గులు అంత‌రాలు లెవ‌ల్ అయ్యాయి. 1913లో విడుద‌లైన రాజా హ‌రిశ్చంద్ర తొలి మూకీ మూవీ. ఆలం అరా (1931) - మొదటి భారతీయ టాకీ. ఆ త‌ర్వాత మిగిలిన‌దంతా చ‌రిత్ర‌. ఇటీవ‌లే పుష్ప చిత్రంతో భార‌తీయ సినిమాకి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్ అవార్డ్ కూడా ద‌క్కింది.

అయితే భార‌తీయ సినిమా య‌థాత‌థ‌ చ‌రిత్ర గురించి నేటిత‌రానికి తెలిసింది త‌క్కువే. అందుకే ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఒక అద్భుత ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలిసింది. జ‌క్క‌న్న ఒక గొప్ప చిత్రం రూప‌క‌ల్ప‌న‌లో భాగం కాబోతున్నారు. రాజమౌళి తన కొడుకు కార్తికేయ సహా ఒక నిర్మాణ బృందాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వీరంతా భార‌తీయ‌ సినిమా పుట్ట‌క‌, పరిణామం గురించి బయోపిక్ ని తీస్తార‌ని తెలుస్తోంది. దీనికి జ‌క్క‌న్న త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు ఇంకా ఎవ‌రో తేల‌న‌ప్ప‌టికీ రాజమౌళి ఈ చిత్రాన్ని నిర్మించి సమర్పిస్తారు. భారీ కాన్వాస్‌పై దీనిని రూపొందించాల‌ని రాజమౌళి యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎవ‌రు? అన్న‌దానిపై మునుముందు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

భార‌తీయ సినిమా చ‌రిత్ర ఇదీ:

భారతదేశంలో మొట్టమొదటి చలనచిత్రం 1913లో విడుదలైంది. అప్పటి నుండి 100 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. ఇందులో టాలీవుడ్ చ‌రిత్ర 79 సంవ‌త్స‌రాలు. భారతీయ సినిమా ప్రపంచంలో నేడు టాలీవుడ్ అత్యున్న‌త స్థానాన్ని అలంక‌రించింది. మన ప్రాంతం నుంచి సినిమా ఊహించలేని మైలురాళ్లను అధిగ‌మించింది. భారతీయ సినిమా ఎదుగుద‌ల క్ర‌మం ప‌రిశీలిస్తే..

1. రాజా హరిశ్చంద్ర (1913) - భారతదేశంలో మొదటి సినిమా

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ చిత్రం ఒక చారిత్రాత్మక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఈ సినిమాకి ఒకే ఒక్క ప్రింట్ మాత్రమే తయారు చేసారు. పట్టాభిషేకం సినిమాటోగ్రాఫ్‌లో ప్రదర్శిత‌మైంది. ఇది కమర్షియల్‌గా విజయం సాధించింది. ఈ రోజు భారతీయ సినిమా రూప‌క‌ల్ప‌న‌లో ఇది తొలి అడుగు. సినిమాని రూపొందించే ప్రతిదానికీ మార్గం సుగమం చేసింది.

2. ఆలం అరా (1931) - మొదటి భారతీయ టాకీ

సినిమా మాధ్యమానికి వాయిస్‌ని అందించిన చిత్రం ఆలం ఆరా. వృద్ధాప్య రాజు అత‌డి ఇద్దరు ప్రత్యర్థి రాణుల గురించిన క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మిది. స‌మ‌స్యాత్మ‌క‌ రికార్డింగ్ పరిస్థితులు .. ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న గోప్యత కారణంగా ఈ చిత్రం చేయడానికి కొన్ని నెలల సమయం పట్టింది.

3. కిసాన్ కన్య (1937) - భారతదేశపు మొదటి రంగుల చిత్రం

కిసాన్ కన్య 1937లో విడుదలైన హిందీ సినీ కలర్ చలనచిత్రం. దీనిని మోతీ బి. గిద్వానీ దర్శకత్వం వహించారు. ఇంపీరియల్ పిక్చర్స్‌కు చెందిన అర్దేశిర్ ఇరానీ నిర్మించారు. ఈ చిత్రం ఒక రైతు పేదరికాన్ని, దుస్థితిని.. రైతుగా ఉన్నందుకు ఎదుర్కొనే పరిణామాలను ఆవిష్కరించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేదు కానీ దేశంలోనే తొలి రంగుల చిత్రంగా గుర్తింపు పొందింది.

4. ధూప్ చావోన్ (1935) - మొదటి ప్లేబ్యాక్ పాట

భారతీయ సినీచ‌రిత్ర‌లో అత్యంత ముఖ్యమైన పరిణామాలలో ఒకటి ప్లేబ్యాక్ సింగింగ్‌ను ప్రవేశపెట్టడం. రాయ్ చంద్ బోరల్ ధూప్ చావోన్ చిత్రంలో ప్లేబ్యాక్ సింగింగ్ తో క్రమబద్ధమైన సాంకేతికతను మొదట ఉపయోగించారు. దీనికి ముందు, నటీనటులు సెట్‌లో ప్రత్యక్షంగా పాడేవారు. అది డైలాగ్‌ల వలె రికార్డ్ అయ్యేది.

5. 1942: ఎ లవ్ స్టోరీ (1994) - మొదటి డాల్బీ సౌండ్ ఫిల్మ్

సంగీత స్వరకర్తగా R.D. బర్మన్ చివరి చిత్రమిది. డాల్బీ సౌండ్ కలిగిన భారతీయ చలనచిత్రంలో మొదటి చిత్రం.

6. అప్రధి (1931) - కృత్రిమ లైట్లతో చిత్రీకరించిన మొదటి భారతీయ చిత్రం

భారతీయ చలనచిత్రం ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరైన పిసి బారువా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కృత్రిమ లైట్లను ఉపయోగించిన మొదటి వ్యక్తిగా కూడా ప్రసిద్ది చెందారు. అతడు లండన్ స్టూడియోలో ప్రొడక్షన్ టెక్నిక్‌లను గమనించాడు. స్టూడియోలో ఉపయోగించే లైటింగ్ పరికరాలను కొనుగోలు చేశాడు. బోస్ దర్శకత్వం వహించిన `అప్రాధి` నుండి మొదటి భారతీయ చిత్రం కృత్రిమ లైట్లను ఉపయోగించడంలో నిమ‌గ్న‌మైంది.

ఇలా చెప్పుకుంటూ వెళితే భార‌తీయ సినిమా రూపాంత‌రం చెందిన తీరు ఎంతో గొప్ప‌ది. ఈ వందేళ్ల పైబ‌డిన చ‌రిత్ర‌లో అధునాత‌న సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుని గొప్ప స్థాయికి సినిమా ఎదిగింది. డీటీఎస్ - సౌండ్ మిక్సింగ్- 70 ఎంఎం ధ్వ‌ని, 3డి , 4డి విజువ‌ల్స్ ఇలా ప్ర‌తిదీ గొప్ప సాంకేతిక‌త‌తో రూపొందిన‌వే. ఐమ్యాక్స్ థియేట‌ర్ల‌లో సినిమా వీక్ష‌ణ అనే గొప్ప అనుభ‌వం నేటి ప్రేక్ష‌కుల‌కు ఉంది. ఇలాంటి ఎన్నో గొప్ప విశేషాల‌తో రాజ‌మౌళి సినిమా తీస్తార‌ని భావించ‌వ‌చ్చు.