Begin typing your search above and press return to search.

భయపెట్టే రాజా సాబ్ వస్తున్నాడు!

అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 11:45 AM GMT
భయపెట్టే రాజా సాబ్ వస్తున్నాడు!
X

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. అలా ఇప్పుడు అతడి చేతిలో ఉన్న చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను రూపొందిస్తోన్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు.


ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' చిత్రం హర్రర్ కామెడీతో రాబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 60 శాతం వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఇప్పటికే చాలా ప్రచార చిత్రాలు వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు దీని నుంచి ఎవరూ ఊహించని ట్రీట్‌ను ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబర్ 23వ తేదీన ఓ వీడియోను విడుదల చేయబోతున్నారు.

‘ది రాజా సాబ్’ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్లు, వీడియోలు అన్నీ సూపర్ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఇప్పుడు వాటికి మించిపోయేలా అక్టోబర్ 23న హర్రర్ ట్రీట్‌ను ఇవ్వబోతున్నారు. దీన్ని ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ఓ సింహాసనం తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తోంది. దీని మీద ‘అతడు రేపు రాబోతున్నాడు’ అనే విషయాన్ని కూడా వెల్లడించారు.

తాజాగా వదిలిన పోస్టర్‌తో పాటు చిత్ర యూనిట్ ‘ఈ సింహాసనం.. పాలించడానికి జన్మించిన వ్యక్తి కోసం వేచి చూస్తోంది’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ‘ది రాజా సాబ్’ టీమ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందని అర్థం అవుతోంది. ఫలితంగా ఈ చిత్రం నుంచి వచ్చే వీడియో కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రియులు అందరూ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.