Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ కొత్త ట్యాగ్ .. ఫుల్ ట్రెండింగ్

మెగా హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   11 May 2024 9:55 AM GMT
రామ్ చరణ్ కొత్త ట్యాగ్ .. ఫుల్ ట్రెండింగ్
X

మెగా హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. చెన్నైలో జరిగిన షెడ్యూల్ లో పాల్గొన్న చరణ్.. రీసెంట్ గా ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు స్వీకారోత్సవంలో తన సతీమణి ఉపాసనతో కలిసి పాల్గొన్నారు.

తాజాగా రామ్ చరణ్.. తన తల్లి సురేఖ, మావయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం వెళ్లారు. తొలుత ప్రైవేట్ జెట్ లో రాజమండ్రి వెళ్లిన చరణ్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పిఠాపురం చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ వచ్చి చరణ్ కు స్వాగతం పలికారు. ఆ తర్వాత పిఠాపురం మార్గంలో అడుగడుగునా అభిమానులే కనిపించారు. ఇక పిఠాపురంలో అయితే చెప్పక్కర్లేదు. అంతలా ఫ్యాన్స్ వచ్చారు.

తన కారు ఓపెన్ టాప్ నుంచి చరణ్ అభివాదం చేశారు. రెడ్ టవల్ ను చూపిస్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. అనంతరం కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అయితే కుక్కుటేశ్వర ఆలయానికి పోలీసులు నియంత్రించే లేనంతగా ఫ్యాన్స్ వచ్చారు. ఇక రామ్ చరణ్.. పిఠాపురంలో ఉన్న తన బాబాయ్, ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తోంది.

అయితే రామ్ చరణ్ పిఠాపురం పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. 'బాబాయ్ కోసం అబ్బాయ్' అంటూ పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. స్పెషల్ గా వీడియోలు ఎడిట్ చేసి మరీ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అన్ని విధాలుగా మామూలు హంగామా చేయడం లేదు. అదే సమయంలో చరణ్ కు కొత్త ట్యాగ్ ఇచ్చారు ఫ్యాన్స్. ఇప్పుడు ఆ ట్యాగ్ ఫుల్ వైరల్ అవుతోంది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కనుక ఆయనను జనసేనాని అని ఎప్పటి నుంచో అంతా పిలుస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కు యువసేనాని అంటూ కొత్త ట్యాగ్ ఇచ్చారు. ఇంకా కొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. అంతకుముందే రామ్ చరణ్ పిఠాపురం వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆయనతోపాటు ఎందరో సెలబ్రిటీల మద్దతు కూడగట్టుకున్న పవన్ ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.