Begin typing your search above and press return to search.

మహేశ్ బాబుతో రామ్ మల్టీస్టారర్?

ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవల కాలంలో బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ అందుకున్నారు

By:  Tupaki Desk   |   2 Aug 2024 4:19 AM GMT
మహేశ్ బాబుతో రామ్ మల్టీస్టారర్?
X

ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవల కాలంలో బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ అందుకున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన 'ది వారియర్'.. పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రూపొందించిన 'స్కంద' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెరఫార్మ్ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఎనర్జిటిక్ హీరో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ మహేష్.. ఇప్పుడు రామ్ తో వైవిధ్యమైన ఎమోషనల్ డ్రామా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. హ్యూమర్ టచ్ తో మంచి సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారని.. రామ్ ఇప్పటి వరకూ నటించని సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. అంతేకాదు ఇందులో హీరోతో పాటుగా మరో కీలక పాత్ర కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

రామ్‌ - మహేశ్.పి సినిమాలో ఒక సీనియర్ స్టార్ హీరో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. అది కథలో చాలా ప్రాధాన్యత ఉన్న ముఖ్యమైన పాత్ర అని, ఒకరకంగా ఇదొక మల్టీస్టారర్‌ మూవీ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామ్‌ గతంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి 'మసాలా' అనే మల్టీస్టారర్‌ చేసారు. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ సీనియర్ హీరో ఎవరనేది మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రామ్ పోతినేని తదుపరి సినిమా రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే క్రమంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాపో ఓ మూవీ చేయనున్నారు. ఇటీవలే దర్శకుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి, అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చెయ్యాలని రామ్ భావిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై అంచనాలను కలిగించింది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో ఈ ఫిక్షనల్ యాక్షన్ మూవీ విడుదల కానుంది.