Begin typing your search above and press return to search.

రానా భయపెట్టే కథ

బాహుబలితో విలన్ గా పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అయినప్పటికీ రానా కెరీర్ పెద్దగా మలుపు తిరగలేదు

By:  Tupaki Desk   |   14 Aug 2024 1:44 PM GMT
రానా భయపెట్టే కథ
X

బాహుబలితో విలన్ గా పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అయినప్పటికీ రానా కెరీర్ పెద్దగా మలుపు తిరగలేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నా హీరోగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ ట్రాక్ ను కూడా కంటిన్యూ చేసుకోలేక పోతున్నాడు. రెగ్యులర్ గా కాకుండా కొత్తగా ఎదో ట్రై చేయాలని హార్డ్ వర్క్ చేసే రానా ఇప్పుడు కూడా కొన్ని క్రేజీ కథలను లైన్ లో పెట్టాడు. ఈ మధ్య కాలంలో, ఆయన సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల పై ఎక్కువ దృష్టి పెట్టారు.

‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో తన ప్రతిభను ప్రదర్శించిన రానా, మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ప్రొడ్యూసర్‌గా కూడా రానా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రానా ప్రస్తుతం బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ పై పని చేస్తున్నారు. ఈ చిత్రం చాలా కాలంగా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.

కిషోర్ అనే డెబ్యూట్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, ఇది ఒక హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పూర్తి అయినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ దసరా పండుగ తర్వాత ప్రారంభమవుతుందని సమాచారం. ‘కేజీఎఫ్’ చిత్రంతో మంచి గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి, ఈ సినిమాలో రానా దగ్గుబాటికి జోడీగా కనిపించనుంది.

హారర్ కథతో పాటు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కూడా ఉంటాయట. ఇక సినిమాను గ్రాండ్ గా తీసుకు రావడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులను ఈ చిత్రం కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో.భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక మరోవైపు రానా, తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజ్యం’ అనే మరో యాక్షన్ డ్రామాలో కూడా నటించనున్నాడు.

ఈ చిత్రం షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇలా హీరోగా సినిమాలు చేయడమే కాకుండా, రానా ప్రస్తుతం తెలుగులో మరో రెండు సినిమాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే ఒక తమిళ సినిమాలో కూడా రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘వెట్టయన్’ అనే చిత్రంలో రానా ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.