సూపర్స్టార్పై ముస్లిమ్ జమాత్ నిషేధం?
బహుశా బాలీవుడ్ లో ఖాన్ లు కుల మతాలకు అతీతంగా ఎదిగేందుకు ఆస్కారం కల్పించింది ఈ సంస్కృతి మాత్రమే.
By: Tupaki Desk | 29 March 2025 5:13 PMభారతదేశం హిందూ - ముస్లిమ్ భాయి భాయి నినాదాన్ని అనుమతించింది. భిన్న మతాలు, సంస్కృతుల మనుగడకు దేశంలో అవకాశం కల్పించింది. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్ ఎవరైనా భరతమాతకు తేడా తెలీదు. బహుశా బాలీవుడ్ లో ఖాన్ లు కుల మతాలకు అతీతంగా ఎదిగేందుకు ఆస్కారం కల్పించింది ఈ సంస్కృతి మాత్రమే. హిందూ దేవతలను ఖాన్ లు దశాబ్ధాలుగా పూజిస్తూ, పండుగలను జరుపుకోవడం అభిమానులు నిరంతరం చూస్తున్నారు. మతానికి అతీతంగా వారికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ రామ్ ఎడిషన్ (రామమందిరం సంక్లిష్టతతో డయల్ రూపొందించిన) వాచ్ ని ధరించడం ఒక ప్రత్యేక ముస్లిమ్ తెగకు నచ్చకపోవడం చర్చగా మారింది.
సల్మాన్ ఖాన్ కి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వి బరేల్వి వార్నింగ్ ఇచ్చారు.
సల్మాన్ ఖాన్ `రామ్ ఎడిషన్` వాచ్ ధరించడం హరామ్.. అతడు తక్షణం క్షమాపణ కోరాలి అని మతాధికారి షాబుద్దీన్ డిమాండ్ చేసారు. ఇస్లామేతర చిహ్నాలను ప్రోత్సహించడం ఇస్లాం మతంలో నిషిద్ధం (హరామ్) అని పేర్కొన్నారు.
భారతదేశంలో ప్రసిద్ధ ముస్లిం వ్యక్తి అయిన సల్మాన్ ఖాన్ రాముడి ఆలయాన్ని ప్రచారం చేయడానికి `రామ్ ఎడిషన్` అనే గడియారాన్ని ధరించడంతో ఈ వివాదం మొదలైంది. సల్మాన్ ఖాన్ సహా ఏ ముస్లిం కూడా ఇస్లామేతర సంస్థలను లేదా మతపరమైన చిహ్నాలను ప్రోత్సహించడం అనుమతించలేమని (హరామ్) ముస్లిమ్ జమాత్ అధ్యక్షుడు అన్నారు. వెంటనే సల్మాన్ పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాలని, ఇస్లామిక్ చట్టాన్ని (షరియా) గౌరవించాలని, దాని సూత్రాలను అనుసరించాలని సలహా ఇచ్చాడు. ఇలాంటి పనులు నిషేధం. ఇందులో పాల్గొన్న వ్యక్తి క్షమాపణ (తోబా) కోరాలి. ఈ తప్పును పునరావృతం చేయకూడదు.. అని అన్నారు.
రామ్ ఎడిషన్ గడియారాన్ని ధరించడం, ప్రచారం చేయడం ఇస్లాం కాని మతపరమైన చిహ్నాలను ఆమోదించడంతో సమానమని, ఇది ఆమోదయోగ్యం కాదని మతాధికారి అన్నారు. రామ్ ఎడిషన్ గడియారాన్ని ధరించడం, ప్రచారం చేయడం విగ్రహాలను లేదా ఇస్లామేతర మతపరమైన చిహ్నాలను ప్రోత్సహించడంతో సమానం.. ఇస్లామిక్ చట్ట ప్రకారం నిషేధితమైనదని అతడు అన్నాడు.
సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం `సికందర్` ప్రమోషన్ సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ రామ జన్మభూమి వాచ్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇన్స్టా పోస్ట్లో అతడు బంగారు డయల్, నారింజ పట్టీని కలిగి ఉన్న వాచ్ను ధరించి కనిపించాడు. పరిమిత ఎడిషన్ వాచ్లో కేసుపై రామ జన్మభూమిని డిజైన్ చేసారు. డయల్ రామ జన్మభూమి ఆలయం డీటెయిలింగ్ తో చెక్కినది. అలాగే డయల్ నొక్కుపై హిందూ దేవుళ్ల శాసనాలు ఉన్నాయి.
శ్రీ రామ జన్మభూమి మందిర్ `ప్రాణ్ పాటిష్ఠ` వేడుక గత సంవత్సరం జనవరి 22న జరిగింది. దీనిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధాన ఆచారాలు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ఈ విగ్రహం 51 అంగుళాల ఎత్తు, 1.5 టన్నుల బరువు ఉంటుంది. ఇది శ్రీరాముడిని ఐదేళ్ల బాలుడిగా ఆవిష్కరించింది.