Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ కేసు: 9మంది నిందితుల‌పై 1735పేజీల ఛార్జ్ షీట్

సల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్ సహా 9 మందిపై క్రైమ్ బ్రాంచ్ 1735 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది

By:  Tupaki Desk   |   11 July 2024 10:16 AM GMT
స‌ల్మాన్ కేసు: 9మంది నిందితుల‌పై 1735పేజీల ఛార్జ్ షీట్
X

సల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్ సహా 9 మందిపై క్రైమ్ బ్రాంచ్ 1735 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దర్యాప్తులో అధికారులను ఆశ్చర్యపరిచే ఎన్నో విష‌యాలు వెలుగు చూసాయి. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ చేతుల్లో ఉంది. ఇందులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసారు. ఇటీవల పోలీసులు నిందితుల‌పై ఛార్జిషీట్ దాఖలు చేసార‌ని ఏఎన్ఐ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

ఏఎన్ ఐ వార్తా క‌థ‌నం ప్రకారం... ముంబై క్రైమ్ బ్రాంచ్ MCOCA (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద 1735 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో పేర్కొన్న పేర్లలో ఆరుగురు అరెస్టయిన నిందితులు (హర్పాల్ సింగ్, విక్కీ కుమార్ గుప్తా, సాగర్ కుమార్ పాల్, మహమ్మద్ రఫీక్ సర్దార్ చౌదరి, దివంగత అనూజ్ థాపన్ , సోను సుభాశ్చంద్ర బిష్ణోయ్) స‌హా భయంకరమైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను క‌లుపుకుని మ‌రో ముగ్గురు వాంటెడ్ నిందితులు ఇందులో ఉన్నారు. ఛార్జిషీట్‌లో మూడు వాల్యూమ్‌లలో రూపొందించిన అనేక దర్యాప్తు పత్రాలు ఉన్నాయని ఒక అధికారి వెల్లడించినట్లు పిటిఐ పేర్కొంది. 46 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసారు. మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన CrPC సెక్షన్ 164 కింద కేసు న‌మోదైంది. MCOC చట్టం ప్రకారం.. నేరాంగీకార వాంగ్మూలాలు, మొత్తం 22 పంచనామాలు, సాంకేతిక ఆధారాలను కూడా ఛార్జ్ షీట్ పత్రాలలో చేర్చారు.

జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులకు బాధ్యత వహించాడు. క‌డ‌ప‌టి వార్త‌ల నాటికి.. ఫోరెన్సిక్ వెరిఫికేషన్ కోసం అరెస్టు చేసిన అనుమానితులలో ఒకరి నుండి ఆడియోను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఇది వాస్తవానికి అన్మోల్ బిష్ణోయ్ వాయిస్ అని వారు కనుగొన్నారు.

భారతదేశ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న కెనడియన్-నివాస గ్యాంగ్‌స్టర్ అన్మోల్ షూటర్‌లను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించాడు. 15 మార్చి 2024న వారికి పన్వెల్‌లో ఆయుధాలను అందజేయడంలో సహాయపడ్డాడు. అతను లక్ష్యం గురించి వివరాలను వారికి అందిస్తున్నట్లు క‌నుగొన్నారు. సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో షూటింగ్‌ను ఎలా నిర్వహించాలో వారికి సూచనలను అందించారు. షూటర్లకు అన్మోల్ బిష్ణోయ్ ప్రణాళిక ప్రకారం వారి పని కోసం రూ.3 లక్షలు చెల్లించారు. అందులో ఒక‌రు ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ప‌లు దేశాలలో అధికారులచే రెడ్ ఫ్లాగ్ దాఖ‌లైంది.