Begin typing your search above and press return to search.

టార్గెట్ సల్మాన్: మరో ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులకు లింకు?

37 ఏళ్ల చౌదరి ఏప్రిల్ 12న ఖాన్ నివసించే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ల వీడియోను రికార్డ్ చేసి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌కు పంపినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులకు చెప్పాడు.

By:  Tupaki Desk   |   14 May 2024 4:34 AM GMT
టార్గెట్ సల్మాన్: మరో ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులకు లింకు?
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలో గత నెలలో జరిగిన కాల్పుల్లో లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని కనీసం ఐదుగురు సభ్యులు పాల్గొన్నట్లు ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో వెల్లడైంది. ప్ర‌స్తుతం ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌తో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వారిలో ఒకరు క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు తాజా స‌మాచారం మేరకు ఆరో నిందితుడిని హ‌ర్యానా నుంచి అరెస్ట్ చేసిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

ఇప్ప‌టికే అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరైన మహమ్మద్ రఫీక్ సర్దార్ చౌదరి తన విచారణలో రాజస్థాన్‌కు చెందిన మరో ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏప్రిల్ 14 ఘటనలో పాల్గొన్నార‌ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA), 1999 కింద కేసుల కోసం ప్రత్యేక కోర్టు చౌదరి పోలీసు కస్టడీని మే 16 వరకు పొడిగించింది.

37 ఏళ్ల చౌదరి ఏప్రిల్ 12న ఖాన్ నివసించే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ల వీడియోను రికార్డ్ చేసి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌కు పంపినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులకు చెప్పాడు. క్రైమ్ బ్రాంచ్ చౌదరి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. సాంకేతిక నిపుణుల సహాయంతో అప్ప‌టికే ఫోన్ ల్యాప్ టాప్ ల నుంచి తొలగించిన‌ వీడియోలు ఫోటోలను తిరిగి పొందామ‌ని అధికారులు తెలిపారు. తదుపరి విచారణలో తాను బిష్ణోయ్ ముఠా సభ్యుల నుండి రూ. 3 లక్షల నగదు వసూలు చేశానని.. ఇద్దరు షూటర్లు విక్కీ కుమార్ గుప్తా (25), సాగర్ కుమార్ పాల్ (24) లకు రూ. 2 లక్షలు ఇచ్చినట్లు చౌదరి అంగీకరించాడు.

దాదాపు రెండు దశాబ్దాలుగా ముంబైలో నివసిస్తున్న చౌదరిని ఏప్రిల్ 30న రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. పోలీసుల వివ‌రాల‌ ప్రకారం.. అతడు లారెన్స్ బిష్ణోయ్ నమ్మకమైన సహాయకుడు రోహిత్ గోదారాతో టచ్‌లో ఉన్నాడు. అతడి పేరు గుప్తా మరియు పాల్‌ల విచారణ సమయంలో బయటపడింది. గుప్తా అన్మోల్ బిష్ణోయ్‌తో కూడా మాట్లాడారని, వారి రికార్డ్ చేసిన వాయిస్ కాల్‌లలో కొన్నింటిని కేసులో ముఖ్యమైన సాక్షిగా ఉన్న అతని సోదరుడు సోను గుప్తాకు పంపారని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లో రెండేళ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన బిష్ణోయ్‌కు చెందిన విశ్వసనీయ ముఠా సభ్యుడు అంకిత్ అరోరాతో పాల్‌కు సంబంధాలుండేవి. అతనికి మరొక ముఠా సభ్యుడు (పోలీసులు వెతుకుతున్నారు.. ఎవరి పేరు వారు వెల్లడించలేదు) భారీ మొత్తంలో డబ్బు వాగ్దానం చేసిన తర్వాత, పాల్ తనతో ఉద్యోగం చేయమని విక్కీ గుప్తాను ఒప్పించాడు.

ముఠా సభ్యుడు రెక్కీ కోసం 2023 అక్టోబర్‌లో కొన్ని రోజుల పాటు ముంబైకి వెళ్లాలని ఇద్దరినీ ఆదేశించాడు. ఖర్చుల కోసం వారికి రూ.40,000 ఇచ్చాడు. వారు మార్చిలో నగరానికి తిరిగి వచ్చారు. అంటే వారు కుర్లాలో చౌదరిని కలుసుకున్నారు. ఖాన్ నివాసం ప‌రిస‌రాల్లో రెక్కీ నిర్వహించారు. ఏప్రిల్ 14, ఆదివారం తెల్లవారుజామున వీరిద్దరూ ఖాన్ మొదటి అంతస్తులోని అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిపారు. మోటార్‌బైక్‌పై పారిపోయే ముందు గాలిలోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపారు.

గుప్తా - పాల్ మొత్తం ఆపరేషన్ కోసం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఆరు నుండి ఏడు వాయిదాలలో రూ.5 లక్షలు పొందారు. ఇద్దరూ ముఠా సభ్యుని పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వారికి భారీగా డబ్బు ఇస్తామ‌ని వాగ్దానం చేసారు.. కానీ ఆ డ‌బ్బును పొందలేదు! అని అధికారి చెప్పారు. ఏప్రిల్ 16న గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేసిన గుప్తా- పాల్‌లను MCOCA కోర్టులో హాజరుపరిచారు. 23 రోజుల పోలీసు కస్టడీ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

చౌధురి , ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటున్న‌ షూటర్లు కాకుండా, క్రైమ్ బ్రాంచ్ ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో ఉన్నప్పుడు మే 1 న ఆత్మహత్య చేసుకున్న అనూజ్ థాపన్ (32), సోను సుభాశ్చంద్ర బిష్ణోయ్ (37) పంజాబ్ నుండి వ‌చ్చారు. మార్చి 15న థాపన్ ..సోను బిష్ణోయ్ పన్వెల్‌లో గుప్తా - పాల్‌లను కలుసుకున్నారు. వారికి రెండు పిస్టల్స్ ..38 లైవ్ రౌండ్లు తూటాలు అందజేసారు. వాటితో స‌ల్మాన్ అపార్ట్‌మెంట్ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.