దర్శకుడు శంకర్ ఆస్తుల అటాచ్మెంట్ ఈడీ తొందరపాటు
శంకర్ పిటిషన్కు కౌంటర్ రెస్పాన్స్ దాఖలు చేయాలని కోర్టు ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ కోసం కేసును ఏప్రిల్ 21కి వాయిదా వేసింది.
By: Tupaki Desk | 13 March 2025 5:00 AM ISTస్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రోబో (ఎంథిరన్) కొన్నేళ్ల క్రితం కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 10 కోట్లకు పైగా విలువైన తన మూడు ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు మంగళవారం నిలిపివేసింది. రజనీకాంత్ - ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన శంకర్ 2010 బ్లాక్బస్టర్ చిత్రం 'ఎంథిరన్' కాపీరైట్ వివాదం కారణంగా ఈ అటాచ్మెంట్ను మొదట ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఆదేశించింది.
ఫిబ్రవరి 17న ఈడీ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ శంకర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ ఎన్ సెంథిల్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. శంకర్ పిటిషన్కు కౌంటర్ రెస్పాన్స్ దాఖలు చేయాలని కోర్టు ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ కోసం కేసును ఏప్రిల్ 21కి వాయిదా వేసింది.
చెన్నైలోని ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టులో తన చిన్న కథ 'జుగిబా'ను కాపీ చేసారని రచయిత ఆరూర్ తమిళనాదన్ ఫిర్యాదు చేయగా, ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ చర్య తీసుకుంది. కాపీరైట్ చట్టం కింద నేరాలు పిఎంఎల్.ఏ కింద షెడ్యూల్డ్ నేరాలుగా పరిగణించబడుతున్నందున ఈడీ ఆస్తి అటాచ్మెంట్ను కొనసాగించింది. అయితే కాపీరైట్ వివాదం న్యాయపరమైన ఫలితం కోసం వేచి ఉండకుండా ఆస్తులను అటాచ్ చేయడంలో ఈడీ తొందరపడటంపై హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. నేరం జరిగిందని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేయవచ్చా? ఆస్తిని అటాచ్ చేసే ముందు ఈడీ ఫిర్యాదు ఫలితం కోసం ఎందుకు వేచి ఉండలేదు? అని కోర్టు ప్రశ్నించింది.
జూన్ 2023లో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ న్యాయపరమైన ప్రశ్న ఎదురైంది. ఇది శంకర్పై తమిళనాదన్ చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కోర్టుకు చూపించలేదు. కాపీరైట్ను కేవలం ఒక ఆలోచన లేదా భావనపై క్లెయిమ్ చేయలేమని పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించిన క్రిమినల్ ఫిర్యాదును మూడు సంవత్సరాలుగా నిలిపివేసినందున, ఈడీ అటాచ్ మెంట్ అనవసరమైనదని కోర్టు వ్యాఖ్యానించింది.