Begin typing your search above and press return to search.

పుష్ప 2: ఆఖరికి బడా హీరోయిన్ రంగంలోకి..

అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్దా కపూర్‌ను ఫైనల్ చేశారట.

By:  Tupaki Desk   |   21 Oct 2024 12:21 PM GMT
పుష్ప 2: ఆఖరికి బడా హీరోయిన్ రంగంలోకి..
X

ఒకప్పుడు ఇండియా అంటే సినిమా రంగంలో బాలీవుడ్ గురించే ఎక్కువగా చెప్పుకునే వారు. కానీ, ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ సినిమా రంగాల హవా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌ రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీనికి ఎన్నో చిత్రాలు దోహదం చేశాయి. అలాంటి వాటిలో 'పుష్ప ది రైజ్' ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం సంచలనమే సృష్టించింది.

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప ది రైజ్' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధించడంతో.. దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తీస్తున్నారు. ఇందులో పుష్పరాజ్ రూలర్‌గా మారడాన్ని చూపించబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై హైప్ అదిరిపోయేలా పెరిగిపోతోంది. అందుకు తగ్గట్లుగానే దీన్ని గతంలో కంటే ఉన్నతంగా రూపొందిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప ది రైజ్' మూవీలో సమంత రూత్ ప్రభు చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట దేశ వ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. దీంతో ఇప్పుడు ఎన్నో అంచనాల నడుమ రూపొందనున్న 'పుష్ప ద రూల్' మూవీలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్‌ను పెట్టబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది.

'పుష్ప ది రూల్' సినిమాలో బాలీవుడ్ బ్యూటీతోనే స్పెషల్ సాంగ్ చేయించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్, త్రిప్తి డిమ్రీ, మలైకా అరోరా, సమంత, పూజా హెగ్డే సహా ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, వీళ్లెవరూ కన్ఫార్మ్ కాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్దా కపూర్‌ను ఫైనల్ చేశారట.

అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' సినిమాలో స్పెషల్ సాంగ్‌ను చేసేందుకు శ్రద్దా కపూర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొనబోతుందని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టూన్స్‌ను కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ పాటపై అందరిలోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

'పుష్ప ది రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు. డిసెంబర్ 6వ తేదీన ఇది విడుదల కాబోతుంది.