Begin typing your search above and press return to search.

ఒకేసారి స్టార్స్ అందరినీ లైన్‌లో పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్స్!

అయితే దాదాపు వీరందరితో ఒకేసారి సినిమాలు నిర్మిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ చూడని అరుదైన ఫీట్ సాధించింది 'మైత్రీ మూవీ మేకర్స్'.

By:  Tupaki Desk   |   30 July 2024 3:30 PM GMT
ఒకేసారి స్టార్స్ అందరినీ లైన్‌లో పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్స్!
X

సీనియర్ హీరోలను మినహాయిస్తే టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలన్నీ ఇప్పుడు ఈ అర డజను మంది హీరోలతో సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి. భారీ రెమ్యునరేషన్స్ ఆఫర్ చేస్తూ ఒకరిద్దరితో ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. అయితే దాదాపు వీరందరితో ఒకేసారి సినిమాలు నిర్మిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ చూడని అరుదైన ఫీట్ సాధించింది 'మైత్రీ మూవీ మేకర్స్'.

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ల సారధ్యంలో నడిచే ఈ సంస్థ.. అనతి కాలంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఓవైపు స్టార్ హీరోలతో యూనివర్సల్ సబ్జెక్ట్‌లతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు మీడియం రేంజ్ హీరోలతో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మైత్రీ బ్యానర్ లో అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ఇది బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ను 2024 డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'NTR 31' చిత్రాన్ని నిర్మించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సమర్పించనుంది. దీనికి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ భారీ సినిమాని త్వరలోనే ప్రారంభించనున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీని లాంచ్ చేసారు. దీనికి 'పెద్ది' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లుగా టాక్. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రీ నిర్మాతలు ఈ సినిమాని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది. 'రంగస్థలం' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ మరో సినిమా చేస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించనుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి మైత్రీ ప్రొడ్యూసర్స్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్ లో డార్లింగ్ తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేశారు. ఇదొక పీరియడ్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీ. ‘ఫౌజీ’ అనే టైటిల్ పెడుతున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరుపుకుంది.

ఇలా ఒక్క మహేశ్ మినహా మిగతా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో మైత్రీ నిర్మాతలు ఒకేసారి సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలే. రాబోయే రెండు నెలల్లో వీటిల్లో కనీసం నాలుగు ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉండే అవకాశం ఉంది. అలానే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నారు. ఇదే క్రమంలో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అలానే విజయ్ దేవరకొండతో 'VD 14'.. నితిన్ తో 'రాబిన్ హుడ్' చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఏడాది పొడవునా సినిమాలు చేస్తున్నారు కాబట్టే.. FC-Ormax 2024 పవర్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ హౌస్ గా 'మైత్రీ మూవీ మేకర్స్' నిలిచింది.