Begin typing your search above and press return to search.

మాకు తెలియదా ఎప్పుడు రిలీజ్ చేయాలో..!

సినిమా విడుదల చేయడం చేతనవ్వకుంటే అసలు తీయడం ఎందుకు అన్నట్లుగా చేస్తున్న విమర్శలకు స్టూడియో గ్రీన్‌ సీఈఓ ధనంజయ్‌ స్పందించాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:06 AM GMT
మాకు తెలియదా ఎప్పుడు రిలీజ్ చేయాలో..!
X

స్టార్‌ హీరోల సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఆయా హీరోల ఫ్యాన్స్‌ సోషల్ మీడియా ద్వారా దర్శక నిర్మాతలను అప్‌డేట్స్ కోసం మరియు విడుదల తేదీల కోసం ఒత్తిడి చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ఎప్పుడు విడుదల.. ఇంకా ఎప్పుడు ప్రమోషన్‌ అంటూ చాలా మంది పదే పదే సోషల్ మీడియా ద్వారా అడుగుతూ ఉంటారు.

ఆ మధ్య ప్రభాస్ సినిమాల అప్‌డేట్స్ కోసం యూవీ క్రియేషన్స్ ను ఫ్యాన్స్‌ ఎంతగా ట్రోల్‌ చేశారో అందరికి తెల్సిన విషయమే. ఇప్పుడు తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో స్టూడియో గ్రీన్ గురించి విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి.

సూర్య హీరోగా నటించిన కంగువ మరియు విక్రమ్‌ హీరోగా నటించిన తంగళన్ సినిమాలను స్టూడియో గ్రీన్ నిర్మించింది. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ రావడంతో ఆయా హీరోల ఫ్యాన్స్ స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సినిమా విడుదల చేయడం చేతనవ్వకుంటే అసలు తీయడం ఎందుకు అన్నట్లుగా చేస్తున్న విమర్శలకు స్టూడియో గ్రీన్‌ సీఈఓ ధనంజయ్‌ స్పందించాడు. ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ పై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక సినిమా విడుదల అనేది అంత సులభమైన విషయం కాదన్నాడు.

కొంత మందిని సంతోష పెట్టడం కోసం మేము వెంటనే సినిమా విడుదల తేదీలను ప్రకటించలేం. సినిమా విడుదల అనేది ఫైనాన్షియల్‌ ఇష్యూస్ తో ముడి పడి ఉంటుంది. వందల కోట్లు పెట్టి సినిమాను నిర్మించిన నిర్మాతకు ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయం తెలియదా అంటూ ప్రశ్నించాడు.

ఒక సినిమాను ఎప్పుడు విడుదల చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్తే లాభాలు వస్తాయి అనే విషయం మాకు తెలుసు. దయచేసి అర్థం చేసుకుని ఓపికగా వెయిట్‌ చేయండి. తప్పకుండా అందరిని మెప్పించే సినిమాలు వస్తాయి, కాస్త అటు ఇటుగా మా సినిమాలు మిమ్ములను సంతోష పెడుతాయి అంటూ ట్వీట్‌ చేశాడు. ధనంజయ్ ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.