Begin typing your search above and press return to search.

సాయి పల్లవిలో సీతాదేవి లక్షణాలు లేవా?

రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Jun 2024 11:09 AM GMT
సాయి పల్లవిలో సీతాదేవి లక్షణాలు లేవా?
X

రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'దంగల్' డైరెక్టర్ నితేశ్‌ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ నటిస్తున్నారు. సీతా దేవిగా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుంటే, రావణాసురుడి పాత్రను కన్నడ రాకింగ్ స్టార్ యశ్ పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలున్నాయి. అయితే సాయి పల్లవి ఇందులో సీత పాత్ర పోషించడంపై ప్రముఖ సీరియల్ నటుడు సునీల్ లహ్రీ అసంతృప్తి వ్యక్తం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రామాయణం టీవీ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్రలో నటించడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్ లహ్రీ. ఇటీవల అయన ఓ ఇంటర్వ్యూలో నితేష్ తివారీ తీస్తున్న 'రామాయణం' సినిమా గురించి మాట్లాడుతూ సాయి పల్లవికి దేవత లక్షణాలు లేవని అన్నారు. సీతా దేవిని అందమైన పరిపూర్ణమైన ముఖం కలిగిన స్త్రీగా వర్ణించిన సునీల్.. సాయి పల్లవి ముఖంలో అలాంటి పరిపూర్ణత కనిపించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 'యానిమల్' చిత్రంలో నటించిన రణబీర్‌ కపూర్ ని రాముడి పాత్రలో ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అని సందేహం వ్యక్తం చేశారు.

"నటిగా సాయిపల్లవి ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆమె వర్క్ నేను ఎప్పుడూ చూడలేదు. కానీ లుక్స్ పరంగా ఆమె ఒప్పించలేదు. నా మనస్సులో సీత అంటే చాలా అందంగా, పరిపూర్ణంగా కనిపించే ముఖాన్ని కలిగి ఉంది. కానీ సాయిపల్లవి ముఖానికి అంత పరిపూర్ణత ఉందని నేను అనుకోను. భారతీయుల ఆలోచనలలో, దేవతలందరూ ఈ ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారు తప్పకుండా ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. ఇక్కడ రావణుడు వెంటపడేలా మేకర్స్ సాయి పల్లవిని ఎంత ఆకర్షణీయంగా చూపిస్తారో నాకు తెలియదు" అని సునీల్ లహ్రీ కామెంట్లు చేసాడు. లీకైన ఫోటోలలో రాముడుగా రణబీర్ లుక్ తనకు నచ్చిందని, కానీ అతన్ని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదని అన్నారు.

సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి గురించి సునీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దక్షిణాది అభిమానులు సీరియల్ నటుడిపై మండిపడుతున్నారు. భారతదేశంలోని అత్యుత్తమ నటీమణుల్లో సాయి పల్లవి ఒకరని, సునీల్ లహ్రీవి జాత్యహంకార కామెంట్స్‌గా కొట్టిపారేస్తున్నారు. అద్భుతమైన ఆమె యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి తెలియజేస్తున్నారు. సీతా దేవి పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేస్తుందని, 'రామాయణం' సినిమాతో అందరి నోళ్ళు మూయిస్తుందని అంటున్నారు.

'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.. 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన సహజమైన నటనతో, డ్యాన్స్ లతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అప్పటి నుంచీ సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింఘ రాయ్' 'గార్గి' వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. చేసింది తక్కువ చిత్రాలే అయినా, స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు 'రామాయణం' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. దీంతో పాటుగా శివ కార్తికేయన్ తో 'అమరన్', అక్కినేని నాగచైతన్యతో 'తండేల్' సినిమాల్లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.