Begin typing your search above and press return to search.

డోంట్ వర్రీ ఫ్యాన్స్.. రాజమౌళి అంటే ఆమాత్రం ఉండాలిగా!

అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మహేశ్ దాదాపు ఐదేళ్ల పాటు జక్కన్న దగ్గరే లాక్ అయిపోయే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:55 PM GMT
డోంట్ వర్రీ ఫ్యాన్స్.. రాజమౌళి అంటే ఆమాత్రం ఉండాలిగా!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కలయికలో ఓ భారీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వంచర్ మూవీ కోసం వీరిద్దరూ చేతులు కలిపారు. ఇదొక గ్లోబ్ ట్రాటింగ్ మూవీ అని, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని దర్శకుడు చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మహేశ్ దాదాపు ఐదేళ్ల పాటు జక్కన్న దగ్గరే లాక్ అయిపోయే అవకాశం ఉంది.

ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. రాజమౌళి సైతం ఆ విషయాన్ని కచ్ఛితంగా చెప్పలేడు. ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా, సినిమా కంప్లీట్ అవ్వడానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయమే పడుతుంది. ఎంత కాదనుకున్నా ఒక్కో చిత్రానికి కనీసం మూడేళ్లు టైమ్ పడుతుంది. జక్కన్నతో సినిమా తర్వాత కెరీర్ మొత్తం మారిపోతుంది కాబట్టి, ఇవన్నీ తెలిసే హీరోలు రంగంలోకి దిగుతారు. ఎంత పెద్ద హీరో అయినా సరే డేట్లు, కాల్ షీట్స్ సంగతి పట్టించుకోకుండా ఆయనతో వర్క్ చేయడానికి రెడీ అవుతారు.

'బాహుబలి'ని తీసుకుంటే, ప్రభాస్ దాదాపు ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ లోనే ఉండిపోయారు. ముందుగా ఒక సినిమాగా తీయాలనే స్టార్ట్ చేసారు కానీ, ఆ తర్వాత అది రెండు భాగాలుగా మారింది. దీనికి తగ్గట్టుగానే మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. దీంతో ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కమిట్ అవకుండా పూర్తిగా బాహుబలి కోసమే అంకితం అవ్వాల్సి వచ్చింది. అలానే RRR మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మూడున్నర ఏళ్ళు జక్కన్న దగ్గర లాక్ అయిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ బాబు కూడా SSMB29 కోసం రాజమౌళి దగ్గర బంధీ కాబోతున్నారు.

RRR తర్వాత మహేష్ తో సినిమా చేయబోతున్నానని రాజమౌళి ప్రకటించగానే ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ తరువాత మరో మూవీ చేయకుండా దర్శకధీరుడి ప్రాజెక్ట్ కోసమే వేచి చూస్తున్నారు. సినిమా వచ్చి తొమ్మిది నెలలు దాటినా ఇంతవరకూ SSRMB మూవీ షూటింగుకు వెళ్ళలేదు. ఈ గ్యాప్ లో తన లుక్ మేకోవర్ మీద దృష్టి పెట్టారు. 2025 జనవరిలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. కానీ ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.

లేటెస్టుగా ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇదే నిజమైతే మహేష్ సైతం ఐదేళ్ల సమయం రాజమౌళి కోసం కేటాయించాల్సి ఉంటుంది. రెండు పార్ట్స్ రిలీజ్ అయ్యే వరకూ సూపర్ స్టార్ మరో ప్రాజెక్ట్ కమిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సినిమా ప్రమోషన్స్ అప్పుడు తప్ప మిగతా సమయాల్లో హీరో దర్శనం ఉండకపోవచ్చు. ఇప్పుడంటే ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ కి వెళ్తూ బయట కనిపిస్తున్నారు కానీ, ఒక్కసారి జక్కన్న సినిమా సెట్స్ మీదకి వెళ్లిందంటే మహేష్ ను కొన్నాళ్ళపాటు అందరూ మార్చిపోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది.

కాకపోతే రాజమౌళి సినిమా కోసం ఎన్నేళ్లు సమయం కేటాయించినా.. దానికి తగ్గ ప్ర‌తిఫ‌లం దక్కుతుందే తప్ప, నష్టం ఏమీ ఉండదు. బాహుబలి & RRR సినిమాల తర్వాత ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కక్రేజ్ ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ముగ్గురూ పాన్ ఇండియా స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. SSMB29 తర్వాత మహేశ్ బాబు ఇమేజ్ మరింత మారుతుందని అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ పాన్ ఇండియా మూవీ చెయ్యని మహేష్.. రాజమౌళి చిత్రం తర్వాత ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆయన ఎన్ని పార్ట్స్ తీసినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కలవర పడాల్సిన అవసరం లేదు.