Begin typing your search above and press return to search.

ఆద‌రించిన ప్ర‌జ‌ల కోసం అండ‌గా మేముంటాం!

ప్రకృతి విపత్తులు సంభ‌వించిన స‌మ‌యంలో బాధితులకు ఎప్పుడూ చిత్ర ప‌రిశ్ర‌మ ఆప‌న్న హ‌స్తంగా నిలుస్తుంది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 1:31 PM GMT
ఆద‌రించిన ప్ర‌జ‌ల కోసం అండ‌గా మేముంటాం!
X

ప్రకృతి విపత్తులు సంభ‌వించిన స‌మ‌యంలో బాధితులకు ఎప్పుడూ చిత్ర ప‌రిశ్ర‌మ ఆప‌న్న హ‌స్తంగా నిలుస్తుంది. అంద‌రికంటే ముందుగా బాధితుల కోసం స్పందించేది చిత్ర పరిశ్ర‌మ మాత్ర‌మే అన‌డంలో ఎలాంటి సందేహాం లేదు. ఇప్ప‌టివర‌కూ ఎన్నో విప‌త్తుల స‌మ‌యంలో ప‌రిశ్రమ అండ‌గా నిలిచింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంభ‌వించిన ప‌రిస్థితుల‌పై మొట్ట మొద‌ట‌గా స్పందించింది ప‌రిశ్ర‌మ నుంచే అన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే హీరోలు, నిర్మాత‌లు కొంత‌మంది పెద్ద ఎత్తున విరాళాలు ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బాధితుల కోసం చిత్ర పరివ్రమలోని అన్ని విభాగాలు సంయుక్తంగా ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ త‌రుపున చేయ‌బోతున్న యాక్షన్ ప్లాన్ గురించి తెలిపారు.

ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ,` విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలా మంది బాధ పడుతున్నారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఈసారి కూడా ఎలాంటి సహాయ సహకారాలు చేస్తే బాగుం టుందని చ‌ర్చించాం. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం.

రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాల‌నుకునే వారు ఈ అకౌంట్స్‌కు డబ్బులు పంపించవచ్చు` అన్నారు. సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ , `ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. మా కుటంబం నుంచి కోటి రూపాయలు అందిస్తున్నాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం` అన్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ `మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియ‌జేస్తున్నాం` అన్నారు.

నిర్మాత‌ దిల్ రాజు మాట్లాడుతూ `ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరో పాతిక లక్షలు ఇస్తున్నాం. ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి ఫెడరేషన్ నంబర్‌కు విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం’ అన్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, `రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం` అన్నారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ `వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది` అన్నారు. భరత్ భూషణ్, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, అమ్మిరాజు, భరత్ చౌదరి పాల్గొన్నారు.