ఆత్మలు.దెయ్యాలతో హీరోలు సావాసం!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆత్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ చిత్రాలు కూడా మంచి ఫలితాలు సాధిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 March 2025 6:00 AM ISTప్రస్తుతం టాలీవుడ్ లో ఆత్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ చిత్రాలు కూడా మంచి ఫలితాలు సాధిస్తోన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన `విరూపాక్ష` ఏకంగా 100 కోట్ల వసూళ్లను సాధించింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకూ 100 కోట్లు తెచ్చిన ఏకైక హారర్ థ్రిల్లర్ ఇదే. ఆ తరువాత ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన `మా ఊరి పొలిమేర-2` కూడా మంచి విజయం సాధించింది.
ఈ రెండు విజయాలు టాలీవుడ్ లో ఆత్మల నేపథ్యంలో తెరకెక్కించాలే మేకర్స్ లో మంచి ఆశలు రేపాయి. కొత్తగా ట్రై చేస్తే సక్సెస్ అవ్వొచ్చు అన్న నమ్మకం నవతరం దర్శకుల్లో బలంగా ఏర్పడింది. ఇవేవి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా కాదు కాబట్టి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ `12 ఏ రైల్వే కాలనీ` అనే సినిమా తెరకెక్కుతోంది. ఇది ఆత్మల చుట్టూ తిరిగే కథనే. `పొలిమేర` మేకర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్గా ఈ సినిమాని రూపొందుతుంది.
అన్ని పనులు పూర్తి చేసి వేసవిలో ప్రేక్షుకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే సుశాంత్ హీరోగా పృథ్వీరాజ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుశాంత్ భూత వైద్యుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ కథకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ కూడా తోడైంది. అలాగే మెగా వారసుడు వరుణ్ తేజ్ కూడా ఈసారి హారర్ థ్రిల్లర్ నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో `కొరియన్ కనకరాజ్` చేస్తున్నాడు.
ఇదీ కామెడీ హారర్ టచ్ వున్న కథే. దెయ్యాలు, భూతవైద్యం ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అలాగే యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ కూడా హారర్ థ్రిల్లర్ తో ఓ కథ సిద్దం చేసాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ తుది దశ పనుల్లో ఉంది. ఇందులో ఓ యంగ్ హీరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న `రాజాసాబ్` కూడా మారుతి హారర్ టచ్ తోనే తెరకెక్కిస్తున్నాడు. మూడు తరాల ఆత్మలు, వాటి భావోద్వేగాల్ని హైలైట్ చేస్తూ కామెడీ టచప్ తో తెరకెక్కిస్తున్నారు.