Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ను శాసిస్తున్న టాలీవుడ్!

ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే 'బాలీవుడ్‌' అనే విధంగా హిందీ జనాలు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అంతా పూర్తిగా మారిపోయింది

By:  Tupaki Desk   |   24 April 2024 5:30 PM GMT
బాలీవుడ్ ను శాసిస్తున్న టాలీవుడ్!
X

ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే 'బాలీవుడ్‌' అనే విధంగా హిందీ జనాలు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అంతా పూర్తిగా మారిపోయింది. హిందీ చిత్ర పరిశ్రమ మీద 'సౌత్ సినిమా' కంప్లీట్ డామినేషన్ చూపిస్తోంది. ముఖ్యంగా తెలుగు చిత్రాలు వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. చూస్తుంటే రాబోయే కొన్నేళ్ళపాటు పాన్ ఇండియా వైడ్ గా మన సినిమాల హవానే కొనసాగేలా ఉంది.

మరోవైపు బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఈ ఏడాది కూడా పెద్దగా కలిసి రాలేదు. గడిచిన నాలుగు నెలల్లో కొన్ని హిందీ సినిమాలు హిట్ అయ్యాయి కానీ, ఒక్కటంటే ఒక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడలేదు. పలు భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సమ్మర్, ఈద్ వంటి మంచి సీజన్స్ లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు సైతం చేతులెత్తేశారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న 'బడేమియా చోటేమియా' సినిమా డిజాస్టర్ గా మారింది. 'మైదాన్' లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. దీనికి తోడు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇప్పట్లో ధియేటర్లలోకి వచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సౌత్ సినిమాలపైనే నార్త్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆశలు పెట్టుకున్నారు.

టాలీవుడ్ లో వచ్చే నెల మొదలుకొని ఏడాది చివరి వరకూ అనేక పాన్ ఇండియా సినిమాలు సందడి చేయబోతున్నాయి. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప: ది రూల్' మూవీ ఆగస్టులో రిలీజ్ కాబోతోంది.

RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం దసరా పండుగ సందర్భంగా విడుదల కానుంది. మరో ట్రిపుల్ ఆర్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ దీపావళికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక తమిళ్ నుంచి సూర్య 'కంగువ'.. కమల్ హాసన్ 'ఇండియన్ 2' సినిమాలు కూడా వస్తున్నాయి. ఇలా త్వరలో రాబోయే దక్షిణాది చిత్రాలపై నార్త్ మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే వీటి థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేయబడ్డాయి. ఈ సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ బాక్సాఫీస్‌ కు ఊపిరి పోస్తాయని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనాలు వేస్తున్నారు.

నిజానికి ఇటీవల కాలంలో ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలన్నీ టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. కోట్లు కుమ్మరించి తీసిన హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, పలువురు బాలీవుడ్ అగ్ర నిర్మాతలు మన సినిమాల కోసం చూస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలుగు హీరోలకు, దర్శకులకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. ఆల్రెడీ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో 'వార్ 2' వంటి స్ట్రెయిట్ హిందీ మూవీ చేస్తున్నారు. ప్రభాస్, బన్నీ, చరణ్ కూడా త్వరలో హిందీ చిత్రాలకు సైన్ చేయనున్నారు. ఇక కేజీఎఫ్ హీరో యష్ 'రామాయణం' ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. ఇలా గతంలో లేని విధంగా బాలీవుడ్ బడా నిర్మాతలంతా టాలీవుడ్ హీరోలు, సౌత్ స్టార్స్‌తో సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరు నార్త్ లో తమ మార్కెట్ ను మరింత విస్తరించుకుంటారో చూడాలి.