Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో సీక్వెల్స్ దండయాత్ర.. వామ్మె అన్ని ఉన్నాయా

కానీ ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు.. మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి

By:  Tupaki Desk   |   23 Jan 2024 9:30 AM GMT
టాలీవుడ్ లో సీక్వెల్స్ దండయాత్ర..  వామ్మె అన్ని ఉన్నాయా
X

టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ దండయాత్ర కొనసాగుతోంది. ఒక్కటి రెండూ కాదు.. వచ్చే రెండేళ్లలో కొత్త సినిమాల కంటే సీక్వెల్సే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అసలు స్టోరీ రాసుకునేటప్పుడే పార్ట్-2 కూడా ముహుర్తం ఫిక్స్ చేసేస్తున్నారు దర్శకులు. బిజినెస్ కూడా డబుల్ అవుతుంది కదా అని అంతా ఆ సీక్వెల్స్‌ వైపే అడుగులేస్తున్నారు.

కానీ ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు.. మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. శంకర్ దాదా జిందాబాద్, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, నాగవల్లి, ఆర్య 2. ఇలా.. కొన్నేళ్ల వరకు సీక్వెల్స్ అన్నీ ఫ్లాపులే. కానీ బాహుబలి 2 తర్వాత ఆ సెంటిమెంట్ మారింది. కార్తికేయ 2, బంగార్రాజు, ఎఫ్ 3 లాంటి సినిమాలకు మంచి అప్లాజ్ వచ్చింది.

ఆ విజయాల తర్వాత టాలీవుడ్‌ లో సీక్వెల్స్‌ ట్రెండ్ మరింత ఎక్కువైపోయింది. పాత కథలకు కొనసాగింపు చేస్తున్నారు దర్శకులు. అలా చేస్తే ప్రాజెక్ట్‌ పై అంచనాలు పెంచాల్సిన పని కూడా లేదు. ముందు సినిమానే అన్నీ చూసుకుంటుంది. అది హిట్టైతే ఆ క్రేజ్ దీనికి హెల్ప్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2నే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. పుష్ప రేంజ్ రూ.350 కోట్లు అయితే.. సీక్వెల్ స్థాయి రూ.1000 కోట్లకు చేరిపోయింది.

ఇదొక్కటే కాదు.. డీజే టిల్లు సీక్వెల్‌పై క్రేజ్ మామూలుగా లేదు. సాధారణంగా సిద్ధూ జొన్నలగడ్డ సినిమాలపై ఉండే అంచనాల కంటే టిల్లు స్క్వేర్‌ పై రెండింతలు క్రేజ్ పెరిగింది. డేషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా సీక్వెల్‌ నే నమ్ముకున్నారు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

గూఢచారితో అదరగొట్టిన యంగ్ హీరో అడివి శేష్.. త్వరలోనే గూడఛారి 2తో రానున్నారు. ఇక సలార్ పార్ట్ 2 శౌరాంగ్య పర్వం కూడా 2025లో రాబోతుంది. దానికితోడు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ప్రతినిథి 2తో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు నారా రోహిత్. రాజ రాజ చోరకు సీక్వెల్‌గా స్వాగ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీ విష్ణు.

శర్వానంద్ బ్లాక్ బస్టర్ శతమానం భవతి సీక్వెల్ ను ఇటీవలే ప్రకటించారు దిల్ రాజు. అంజలి గీతాంజలి మూవీ సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. కార్తికేయ 3, విరూపాక్ష 2, బింబిసార 2 కూడా రానున్నాయి. బాలయ్య- బోయపాటి కాంబోలో అఖండ 2 తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అలా ఎటు చూసినా టాలీవుడ్ లో సీక్వెల్సే కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలి.