Begin typing your search above and press return to search.

టాలీవుడ్ క్రేజీ సీక్వెల్స్ ఇవే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో డజనుకు పైగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

By:  Tupaki Desk   |   21 July 2024 4:10 AM GMT
టాలీవుడ్ క్రేజీ సీక్వెల్స్ ఇవే!
X

టాలీవుడ్ లో సీక్వెల్స్ ఊపందుకున్నాయి. ఆల్రెడీ హిట్టయిన సినిమాకి కొనసాగింపుగా పార్ట్-2 ప్లాన్ చేయడం లేదా ఫ్రాంచైజీ చిత్రాలను రూపొందించడం ఇటీవల కాలంలో ట్రెండ్ గా మారిపోయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వకముందే, రెండో భాగాన్ని కూడా ప్రకటించేస్తున్నారు. కొందరైతే ఎస్ఎస్ రాజమౌళి మాదిరిగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో డజనుకు పైగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప: ది రూల్'. ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సెకండ్ పార్ట్. 2024 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన 'కల్కి 2898 AD' చిత్రం రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మూడో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సీక్వెల్ గా 'కల్కి 2' ను ప్రకటించారు. అలానే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్'. దీనికి కొనసాగింపుగా 'సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వం' చిత్రం తెరకెక్కనుంది.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఇది 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సీక్వెల్. ఆగస్టు 15వ తారీఖున విడుదల కాబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ట కలిసి చేసిన సోసియో ఫాంటసీ మూవీ 'బింబిసార'. దీనికి ప్రీక్వెల్ గా ఇటీవల 'బింబిసార 2' చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఈ సినిమాకి అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జతో తీసిన ఎపిక్ బ్లాక్ బస్టర్ 'హను-మాన్'. ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ 'డీజే టిల్లు'. ఈ ఏడాది మార్చిలో దీనికి సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా 'టిల్లు క్యూబ్' రానుందని మేకర్స్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. 'మా ఊరి పొలిమేర' ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో, ఈమధ్యనే 'పొలిమేర 3' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'హిట్' ప్రాంచైజీ మొదలైంది. అడవి శేష్ తో చేసిన 'హిట్ 2' కూడా హిట్టవ్వడంతో, ఇప్పుడు నాని ప్రధాన పాత్రలో 'హిట్ 3: ది థర్డ్ కేస్' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ప్రాంచైజీ 'కార్తికేయ'. 'కార్తికేయ 2' సినిమా విజయం సాధించడంతో, దీనికి కొనసాగింపుగా 'కార్తికేయ 3' ఉంటుందని మేకర్స్ స్పష్టం చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'మ్యాడ్' మూవీకి సీక్వెల్ గా 'మ్యాడ్ మ్యాక్స్' రానుంది.

అడవి శేష్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి'. ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం 'గూఢచారి 2' (G 2) తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమా 'అఖండ'. దీనికి కొనసాగింపుగా రూపొందనున్న 'అఖండ 2' చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలయ్య నటించిన 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ గా 'ఆదిత్య 999 మ్యాక్స్' ప్లాన్ చేస్తున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతున్నారు. దిల్ రాజు బ్యానర్ లో 'శతమానం భవతి' చిత్రానికి సీక్వెల్ గా 'శతమానం భవతి 2' సినిమాను ప్రకటించారు.

అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' ప్రాంఛైజీని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' సినిమాలు సక్సెస్ సాధించడంతో.. 'బంగార్రాజు 2' చేస్తారని టాక్. 'మంగళవారం' సినిమాకి కొనసాగింపుగా 'మంగళవారం 2' ఉంటుందనిడైరెక్టర్ అజయ్ భూపతి ప్రకటించారు. 'ఫలక్ నుమా దాస్ 2', 'దాస్ కా ధమ్కీ 2' చిత్రాలు తెరకెక్కిస్తానని హీరో విశ్వక్ సేన్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. 'స్కంద', 'ఈగల్' 'పెదకాపు 1' లాంటి ప్లాప్ చిత్రాలకు కూడా సీక్వెల్స్ ప్రకటించారు కానీ, వాటి ఫలితాలను బట్టి చూస్తే పార్ట్-2 రావడం కష్టమే అనిపిస్తుంది.