Begin typing your search above and press return to search.

జ‌నసేనానితో టాలీవుడ్ పెద్ద‌ల భేటీ

మ‌హాకూట‌మి విజ‌యం, జ‌న‌సేనాని సెంట్ ప‌ర్సంట్ స‌క్సెస్ టాలీవుడ్ లోను ఉత్సాహం నింపింది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 2:53 PM GMT
జ‌నసేనానితో టాలీవుడ్ పెద్ద‌ల భేటీ
X

మ‌హాకూట‌మి విజ‌యం, జ‌న‌సేనాని సెంట్ ప‌ర్సంట్ స‌క్సెస్ టాలీవుడ్ లోను ఉత్సాహం నింపింది. ప‌రిశ్ర‌మ వ్య‌తిరేక పార్టీని, ముఖ్య‌మంత్రిని దించేసినందుకు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఉత్స‌వాలు జ‌రుపుకుంది. ముఖ్యంగా జ‌న‌సేనాని అఖండ విజ‌యం సాధించి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్ట‌డం, కీల‌కమైన శాఖ‌ల బాధ్య‌త‌ల్ని స్వీక‌రించ‌డంతో ప్ర‌జ‌ల్లో ఉత్సాహం నెల‌కొంది.

ఇక‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సార‌థ్యంలో తెలుగు సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని, మునుప‌టిలా ప‌రిశ్ర‌మ వేడుక‌ల‌ను వైభ‌వంగా జ‌రుపుకునేందుకు ఆస్కారం ఉంటుంద‌ని, సినిమా టికెట్ రేట్ల వెసులుబాటుకు స‌హ‌కారం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఆన‌వాయితీగా ఇప్పుడు సినీపెద్ద‌లు ప‌వ‌న్ ని క‌ల‌వ‌నున్నారు. రేపు అమరావతిలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని కలవాలని టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు, డివివి దానయ్య, అశ్విని దత్, బివిఎస్ఎన్ ప్రసాద్, చినబాబు, నాగ వంశీ, టిజి విశ్వప్రసాద్, మైత్రి నవీన్- రవి, కెఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు రేపు విజయవాడలో పవన్‌ని కలవనున్నారని తెలుస్తోంది. సినీనిర్మాత‌ల‌తో పాటు ప‌లువురు ప‌రిశ్ర‌మ సీనియ‌ర్లు ఉప‌ముఖ్యమంత్రిని క‌లిసే వీలుంద‌ని కూడా స‌మాచారం.

ప‌వ‌న్ ఇప్ప‌టికే త‌న‌దైన మార్క్ చూపిస్తూ ప్ర‌జాసేవ‌లో త‌ల‌మునక‌లుగా ఉన్నారు. ఉప ముఖ్య‌మంత్రి హోదాలో తాను ఏం చేయ‌గ‌లుగుతారో అన్నిటినీ అమ‌లు చేస్తున్నారు. నిర్ణ‌యాల్లో వేగం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. రేప‌టి స‌మావేశంలో ఏపీ టాలీవుడ్ నిర్మాణం గురించి సినీనిర్మాత‌లు ప‌వ‌న్ తో మాట్లాడుతారేమో చూడాలి.