Begin typing your search above and press return to search.

మన హీరోల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!

ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, ఇంకో చిత్రాన్ని పట్టాలెక్కిస్తూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2024 1:30 AM GMT
మన హీరోల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!
X

టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సక్సెస్ రేటుతో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఓవైపు టైర్-1 స్టార్ హీరోలందరూ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మరోవైపు టైర్-2 యంగ్ హీరోలంతా మీడియం రేంజ్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, ఇంకో చిత్రాన్ని పట్టాలెక్కిస్తూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు.


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇది షూటింగ్ దశలో ఉండగానే చిరు మరో ప్రాజెక్ట్ కు పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. బీవీఎస్ రవి కథతో, 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజా డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. వచ్చే నెలలో ఆయన బర్త్ డే నాటికి దీనిపై క్లారిటీ రానుంది.


నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో 'NBK 109' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ మూవీ చేయనున్నారు. ఇది 'అఖండ' చిత్రానికి సీక్వెల్. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. ఆగస్టు తరువాత సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి.


కింగ్ అక్కినేని నాగార్జున 'కుబేర' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. దీని తర్వాత నాగ్ సినిమా ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు. ఓ తమిళ దర్శకుడితో చేతులు కలపబోతున్నారని చాలా రోజులుగా అంటున్నారు కానీ, ఇంతవరకూ ప్రకటన లేదు. ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తారని టాక్.


విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇది వీళ్లిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ.దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందే ఈ చిత్రాన్ని వచ్చే పొంగల్ కి థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 'రానా నాయుడు' సీజన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్ లో రానా దగ్గుబాటి తో కలిసి నటిస్తున్నారు.


రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పుడు 'కల్కి'తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న డార్లింగ్.. మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. త్వరలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చిత్రాన్ని స్టార్ట్ చేస్తారు. ప్రశాంత్ నీల్ తో 'సలార్ 2'.. నాగ్ అశ్విన్ తో 'కల్కి 2' చిత్రాలు చేయాల్సి ఉంది. వీటితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు. ఇది ఇండియన్ సినిమాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించే చిత్రం అవుతుంది. 'SSMB 29' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభిస్తారని నిర్మాతలు చెబుతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టిన సినిమాలు మూడు నాలుగున్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' అనే హిస్టారికల్ అడ్వెంచర్ మూవీలో నటిస్తున్నారు. సుజీత్ డైరెక్షన్ లో OG.. హరీష్ శంకర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు చేస్తున్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత, ఆయన ఎప్పుడు సెట్స్ మీదకు వస్తారు? ఏ సినిమాని కంప్లీట్ చేస్తారు? అనేది క్లారిటీ లేకుండా పోయింది.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2: ది రూల్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ కి వాయిదా పడింది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నారు. గీతా ఆర్ట్స్ & హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లలో ఇప్పటికే దీనికి అధికారిక ప్రకటన వచ్చింది.


మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం భారీ పాన్ ఇండియా చిత్రాలను సెట్ చేసుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'దేవర' పార్ట్-1 సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తారు. త్వరలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' మూవీ మొదలుపెట్టనున్నారు. ఇక 'వార్ 2' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్' సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చెర్రీ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఇదే క్రమంలో డైరెక్టర్ సుకుమార్ తో సినిమా ఉంటుంది.


నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' సినిమాతో ఆగస్టులో సందడి చేయబోతున్నారు. వివేక్ ఆత్రేయ దీనికి దర్శకుడు. దీని తర్వాత శైలేష్ కొలనుతో 'హిట్ 3'.. శ్రీకాంత్ ఓదెల చిత్రాలను ప్రారంభిస్తారు. టీజె జ్ఞానవేల్, శేఖర్ కమ్ముల సినిమాలు కూడా నాని లైనప్ లో ఉన్నాయి. మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో 'మిస్టర్ బచ్చన్' మూవీ రానుంది. ఇటీవలే భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.


యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' వంటి పాన్ ఇండియా సర్వైవల్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. చందు మొండేటి రూపొందిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. దీని తర్వాత కార్తీక్ దండు, శివ నిర్వాణలతో చైతూ వర్క్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఆగస్టు 15న రానుంది. త్వరలోనే పి. మహేష్ బాబుతో రామ్ ఓ చిత్రాన్ని ప్రకటిస్తారని టాక్.


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైనప్ లో గౌతమ్ తిన్ననూరి VD 12, రవికిరణ్ కోల, రాహుల్ సాంకృత్యన్ సినిమాలు ఉన్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'లైలా' చిత్రంతో పాటుగా 'మెకానిక్ రాకీ' మూవీ చేస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ ఓపక్క 'తమ్ముడు', మరోపక్క 'రాబిన్‌హుడ్' సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. విక్రమ్ కె కుమార్ తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిందని టాక్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే రోహిత్ అనే కొత్త దర్శకుడితో సినిమా ప్రకటించారు. సంపత్ నందితో 'గంజా శంకర్' చేయాల్సి ఉంది.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్ లో 'మట్కా' మూవీ రానుంది. దీంతో పాటుగా మేర్లపాక గాంధీ, విక్రమ్ సిరికొండ సినిమాలు వరుణ్ చేతిలో ఉన్నాయి. శర్వానంద్ ప్రస్తుతం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నారు. నిఖిల్ హీరోగా 'స్వయంభూ', 'ది ఇండియన్ హౌస్' వంటి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రూపొందుతున్నాయి. అడివి శేష్ ప్రస్తుతం 'గూడాచారి 2', 'డెకాయిట్' సినిమాలు చేస్తున్నారు. తేజ దర్శకత్వంలో 'రాక్షస రాజ్యం' చిత్రాన్ని ప్రకటించిన రానా దగ్గుబాటి.. 'రానా నాయుడు' సీజన్ 2 ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు.


స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు 'జాక్', 'తెలుసు కదా' చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి తర్వాత 'టిల్లు క్యూబ్' షురూ చేస్తారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' తో పాటుగా లుధీర్, కౌశిక్ వంటి ఇద్దరు దర్శకులతో వర్క్ చేయనున్నారు. అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' సినిమాతో రాబోతున్నారు. శ్రీను వైట్లతో 'విశ్వం' మూవీ చేస్తున్న గోపీచంద్.. రాధాకృష్ణ కుమార్ తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. సుధీర్ బాబు ఇటీవలే ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. అఖిల్ అక్కినేని, నవీన్ పోలిశెట్టి, అల్లు శిరీష్, నాగ శౌర్య వంటి మరికొందరు కుర్ర హీరోలు ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్స్ తో రాబోతున్నారు.