Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో తెలుగమ్మాయిల జోరు!

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం

By:  Tupaki Desk   |   12 March 2024 2:45 AM GMT
టాలీవుడ్ లో తెలుగమ్మాయిల జోరు!
X

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. నిజానికి టాలీవుడ్‌లో అచ్చ తెలుగు హీరోయిన్ల హవా తగ్గిపోయి చాలా కాలం అయ్యింది. 1950స్ నుంచి 80స్ వరకూ తెలుగమ్మాయిల ప్రభంజనం కొనసాగింది.. చాలా మంది స్టార్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. కానీ 90స్ లో బాంబే భామలను దిగుమతి చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత, మన కథానాయికల హవా తగ్గిపోతూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

రాజోల్ బ్యూటీ అంజలి ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ కృష్ణ చైతన్య కాంబోలో తెరకెక్కుతోన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్ చేంజర్' మూవీలోనూ నటిస్తోంది. అలానే 'గీతాంజలి' చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న 'గీతాంజలి మళ్లీ వచ్చింది' హారర్ కామెడీలో హీరోయిన్ గా కనిపించనుంది. దీంతో పాటుగా త్వరలో 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్ తో పకరించబోతోంది అంజలి.

'బేబీ' వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన విజయవాడ అమ్మాయి వైష్ణవి చైతన్య.. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో బిజీగా మారిపోయింది. దిల్ రాజు బ్యానర్ లో ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతోన్న 'లవ్ మీ' సినిమాలో నటిస్తోంది. SKN నిర్మాణంలో హీరో ఆనంద్ దేవరకొండతో కలిసి మరో మూవీ చేస్తోంది. అలానే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందుతున్న 'జాక్ - కొంచం క్రాక్' అనే చిత్రంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా వైష్ణవి కనిపించనుంది.

మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో అలరించిన తెలంగాణా అమ్మాయి అనన్య నాగళ్ళ.. గతేడాది శాకుంతలం, మల్లీ పెళ్ళి, అన్వేషి వంటి మూడు సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు 'తంత్ర' అనే సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అయింది. ఇదే క్రమంలో ఆమె హీరోయిన్ గా నటించిన 'పొట్టేల్' మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. 'అహనా పెళ్ళంట' వెబ్ సిరీస్ తో వచ్చిన శివాని రాజశేఖర్.. ఇప్పుడు 'విద్య వాసుల అహం' అనే సినిమా చేస్తోంది.

తెలంగాణాకు చెందిన శ్రీ గౌరీ ప్రియ లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. ఇటీవల 'ట్రూ లవర్' అంటూ తెలుగు తమిళ భాషల్లో పలకరించింది. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న 'మ్యాడ్ 2' మూవీలో ఒక హీరోయిన్ గా గౌరీ ప్రియ కనిపించనుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రీతూ వర్మ ప్రస్తుతం 'శ్వాగ్' సినిమాలో హీరో శ్రీవిష్ణుకు జోడీగా నటిస్తోంది.

'దేత్తడి హారిక'గా పాపులర్ యూట్యూబర్, 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారిక హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. 'బేబీ' మేకర్స్ నిర్మాణంలో రూపొందే సినిమాలో యంగ్ హీరో సంతోష్ శోభన్ కు జంటగా నటించనుంది. 'బిగ్ బాస్' షో ద్వారా ఫేమస్ అయిన మరో అందాల నిధి దివి వధ్య ఇప్పుడు 'లంబసింగి' మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు హీరోయిన్ గా వస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి నిర్మాత.

గతేడాది 'రావణాసుర' సినిమాతో అలరించిన హైదరాబాద్ గర్ల్ ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. తెలుగమ్మాయి చాందినీ చౌదరి లేటెస్టుగా 'గామి' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈషా రెబ్బా మాయా బజార్ ఫర్ సేల్, దయా వంటి వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది. 'సుందరం మాస్టారు' సినిమాలో హీరోయిన్ గా కనిపించిన దివ్య శ్రీపాద వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లంతా ఇప్పుడు ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాకపోతే వీరిలో అంజలి మినహా ఇతర తెలుగమ్మాయిలెవరూ పెద్ద ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకోవడం లేదు. మరి రానున్న రోజుల్లో మన తెలుగింటి అందాలు క్రేజీ ఆఫర్స్ అందుకొని, స్టార్ హీరోయిన్ల రేంజ్ కు వెళ్తారేమో వేచి చూడాలి.