విజయ్ దేవరకొండ విమానంకి సాంకేతిక సమస్య..!
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణించాల్సిన విమానం సాంకేతిక సమస్య కారణంగా గంటల తరబడి టేక్ ఆఫ్ కాకుండా రన్ వే పై అలాగే ఉండి పోయింది.
By: Tupaki Desk | 7 Feb 2025 10:37 AM GMTటాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణించాల్సిన విమానం సాంకేతిక సమస్య కారణంగా గంటల తరబడి టేక్ ఆఫ్ కాకుండా రన్ వే పై అలాగే ఉండి పోయింది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్కి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. హీరో విజయ్ దేవరకొండ మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు విమానంలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. సాంకేతిక సమస్య గురించి ముందస్తు సమాచారం ఇవ్వక పోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యూపీలోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకి హాజరు అయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రతి రోజు పెద్ద ఎత్తున ప్రయాణికులు వెళ్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రత్యేక విమాన సర్వీసులను విమానయాన సంస్థ నడుపుతోంది. స్పైస్ జెట్ విమానంలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది. విమానం సాంకేతిక సమస్యను ముందస్తుగా గుర్తించని అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఇలా గంటల తరబడి వెయిటింగ్ చేసేలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని స్పైస్ జెట్ సంస్థపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని గంటల ఎదురు చూపుల తర్వాత విజయ్ దేవరకొండతో పాటు ప్రయాణికులు అంతా టేకాఫ్ అయ్యారు. క్షేమంగా ప్రయాగ్ రాజ్లోనూ ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ బుక్ చేసుకున్న వారిని గంటల తరబడి వెయిట్ చేయించడం అనేది కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా ద్వారా స్పైస్ జెట్ సంస్థపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల మాదిరిగా ఎయిర్ బస్సులను ఆలస్యం చేస్తే సెలబ్రెటీలు, వీఐపీలు ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోలేరా అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్వీట్ చేశారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుత సినిమా విషయానికి వస్తే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ను అతి త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. విజయ్ దేవరకొండ గత చిత్రం ఫలితం నేపథ్యంలో ఈ సినిమాపై అదనపు దృష్టి పెట్టి మరీ చేశారని తెలుస్తోంది. విభిన్నమైన టైటిల్ను ఖరారు చేశారని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.