Begin typing your search above and press return to search.

SSMB29: క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!

ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:50 AM GMT
SSMB29: క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి SSMB29, SSRMB వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఓ క్రేజీ అప్డేట్ అందించారు.

'SSMB29' స్టోరీ అందిస్తున్న దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తాజాగా ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి మాట్లాడారు. మహేశ్ బాబు - రాజమౌళిల సినిమా 2025 జనవరిలో ప్రారంభం అవుతుందని చెప్పారు. సాధారణంగా తాను ఓ కథ రాయడానికి 3 నుంచి 4 వారాలు పడుతుందని.. కానీ మహేష్ కోసం కథ రాయడానికి 2 ఏళ్ల సమయం పట్టిందని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మహేశ్, రాజమౌళి కలిసి సినిమా చెయ్యాలని దశాబ్ద కాలం క్రితమే చర్చించుకున్నారు. కానీ వారికున్న ఇతర కమిట్ మెంట్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ తో వర్క్ చేయబోతున్నట్లు జక్కన్న స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చిత్రాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో అంతా వేచి చూస్తున్నారు. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ లో ప్రారంభిస్తామని నిర్మాత కె.ఎల్‌. నారాయణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కానీ, అలా జరగలేదు. అయితే వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్తుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మహేష్ బాబు కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ గతంలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. మహేష్ తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ చేయబోతున్నానని, ఇది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని రాజమౌళి చెబుతున్నారు. 'ఇండియానా జోన్స్' తరహాలో ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో హలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

SSMB29 కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. పొడవాటి జుట్టు, గడ్డం మీసాలతో మునుపెన్నడూ చూడని స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. మరోవైపు సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో నటించే నటీనటుల గురించి కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు.