Begin typing your search above and press return to search.

మ్యూజిక్ అదిరిపోతే బాగోలేదని కొందరు రాశారు: విశ్వక్

"ఇటీవల కొందరు థియేటర్లు ఏకంగా మూసేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ వస్తుండడం హ్యాపీ. కానీ కొంతమంది సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 5:45 AM GMT
మ్యూజిక్ అదిరిపోతే బాగోలేదని కొందరు రాశారు: విశ్వక్
X

టాలీవుడ్ మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి. అభిమానుల భారీ అంచనాల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయింది. పాజిటివ్‌ టాక్ దక్కించుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మూవీకి మంచి టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్‌, డైరెక్టర్‌ కృష్ణ చైతన్య నిన్న రాత్రి ప్రెస్‌ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ చిత్రానికి వచ్చిన రివ్యూలపై విశ్వక్‌ సేన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మూవీ రిలీజైన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కొద్ది నెలలుగా టాలీవుడ్‌ లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దాన్ని గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా విశ్వక్ సేన్ స్పందించారు. వారం సంగతేమో గానీ సినిమా చూడకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఉదయం 6 గంటలకు, 5 గంటలకే రివ్యూలు ఇచ్చారని అన్నారు. సినిమాకు ప్రధాన బలంగా ఉన్న మ్యూజిక్ బాగాలేదని కొన్ని రివ్యూల్లో ఉందని తెలిపారు.

దాని బట్టి వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైందని అన్నారు విశ్వక్ సేన్. నైట్ రివ్యూ రాసుకుని పొద్దున్నే జస్ట్ పోస్ట్ చేశారని ఆరోపించారు. "చెప్పాలంటే బాలీవుడ్ తో పోలిస్తే తెలుగులో సినిమా టికెట్ల రేట్లు తక్కువ. ఇక్కడ రెవెన్యూ బాగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను బేస్ చేసుకుని ఎంతోమంది బతుకుతున్నారు. రెండు నెలల నుంచి సినిమాలు లేవు. ఇప్పుడు థియేటర్లకు మళ్లీ ప్రజలు వస్తుండడంతో సంతోషించాలి" అని తెలిపారు.

"ఇటీవల కొందరు థియేటర్లు ఏకంగా మూసేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ వస్తుండడం హ్యాపీ. కానీ కొంతమంది సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు. ఈ విషయం చాలా మంది నాకే డైరెక్ట్ గా కాల్ చేసి చెప్పారు. ఫస్టాఫ్ కు ఒక రివ్యూ.. సెకండాఫ్ మరో రివ్యూ ఇస్తున్నారు. అదేంటో నాకు అసలు అర్థం కావడం లేదు. సినిమా మధ్యలో పాజ్ చేశారమో. ఈ విషయంలో ఏం చేయాలో కూడా తెలియడం లేదు" అని విశ్వక్ అన్నారు.

"శత్రువులు ఎక్కడో లేరు. మన పరిస్థితులను మార్చలేం. చెప్పి చెప్పి అలసిపోయాను. డిస్ట్రిబ్యూటర్ కు కాల్ చేస్తే మూడ్ సెట్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు సినిమా ఎలా ఉందనేది, ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది. నిజానికి మేము ఇప్పుడు కేక్ కట్ చేసి క్రాకర్స్ కాల్చాలి. కానీ మా నిర్మాత ఇంట్లో విషాదం జరగడం వల్ల సింపుల్ గా కేవలం ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పేందుకు ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశాం" అని విశ్వక్ సేన్ ముగించారు.