Begin typing your search above and press return to search.

అంటే.. ఆశించింది ఇవ్వలేకపోయాం!

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

By:  Tupaki Desk   |   20 Aug 2024 6:07 AM GMT
అంటే.. ఆశించింది ఇవ్వలేకపోయాం!
X

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేసే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా పై తనకు ఉన్న నమ్మకం ను వ్యక్తం చేశాడు. ఇంతకు ముందు చేసిన తప్పులు ఈ సినిమాలో పునరావృతం కాకుండా చేశామని చెప్పుకొచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో నానిని గతంలో వివేక్ ఆత్రేయ తో చేసిన 'అంటే సుందరానికి..' సినిమా గురించి ఫెయిల్యూర్‌ గురించి ప్రశ్నించిన సమయంలో ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. వివేక్ తో సినిమా ప్రకటించిన సమయంలో ప్రేక్షకులు మా నుంచి ఒక మంచి ఎంటర్‌టైనర్‌ ను ఆశించారు. కానీ ఆ సినిమా చాలా స్లోగా ఎమోషనల్‌ లవ్‌ డ్రామాగా సాగింది. అందుకే ప్రేక్షకులు సినిమాను ఆదరించలేదు అంటూ ఒప్పుకున్నాడు. అంతే కాకుండా దర్శకుడు వివేక్ ఆత్రేయ నాకు ఏదైతే స్క్రిప్ట్‌ చెప్పాడో అదే తీశాడు. కనుక సినిమా ఫెయిల్యూర్‌ బాధ్యత నేనే తీసుకుంటాను అన్నాడు.

అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ కాకున్నా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ నిర్మాతకు భారీ మొత్తంలో నష్టాలు అయితే రాలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. వివేక్ ఆత్రేయ పై కూడా నానికి చాలా నమ్మకం. ఆ సినిమా ఫలితం గురించి ఆలోచించకుండా తక్కువ సమయంలోనే ఈ సినిమా ఛాన్స్ ను ఇవ్వడం ద్వారా నాని తన సినిమాల ఎంపిక విధానం ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. నాని తనపై పెట్టుకున్ననమ్మకంను ఈసారి వమ్ము చేసేది లేదు అనే కసితో సరిపోదా శనివారం సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించినట్లు తెలుస్తోంది.

సినిమా ప్రకటించిన సమయంలోనే కథ ఏంటి, కథనం ఎలా సాగుతుంది అనే విషయాలపై ఒక ఐడియా ను ప్రేక్షకులకు ఇచ్చారు. సినిమాలో శనివారం రోజు అత్యంత కీలకంగా ఉంటుంది. శనివారం మాత్రమే చాలా స్పెషల్‌ గా ఉండే హీరో జీవితంలో సాగే విభిన్న సంఘటనలు ఏంటి, అసలు ఆ శనివారం కథ ఏంటి అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలు అయ్యింది. నానికి జోడీగా ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటించింది. తమిళ స్టార్‌ దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా కోలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా పాన్ ఇండియా హిట్‌ కొట్టాలని ఆశ పడుతున్న నానికి ఈ సినిమా తో అయినా ఆ హిట్‌ దక్కేనా అనేది తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్‌ చేయాల్సిందే.