Begin typing your search above and press return to search.

చంద్రబాబు, లోకేష్, పవన్... ముగ్గురికీ ఒకటే ఆహ్వాన పత్రిక!

అవును... రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం "వ్యూహం" సినిమా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Dec 2023 11:57 AM GMT
చంద్రబాబు, లోకేష్, పవన్... ముగ్గురికీ ఒకటే ఆహ్వాన పత్రిక!
X

ట్విట్టర్ వేదికగా దర్శకుడు రాం గోపాల్ వర్మ చేసే కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! సామాజిక, రాజకీయ, సినిమా అంశాలపైనా అదే ప్లాట్ ఫాం పై స్పందించడంతోపాటు.. తనదైన వెటకారాన్ని కూడా అదే వేధికపైనుంచి ప్రదర్శిస్తుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం "వ్యూహం" మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తున్న ఆర్జీవీ రేపు (23-12-23) ఆ సినిమా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికి ఆ ముగ్గురికీ వెల్ కం చెప్పారు.


అవును... రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం "వ్యూహం" సినిమా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి.. ఎలాంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నారు వంటి విషయాలు ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ట్రైలర్ చూసిన వారికి ఈ సినిమా కథపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.

అయితే కథనం, ఆ పాత్రలను మలిచిన తీరుతెన్నులు, వారితో చెప్పించిన డైలాగులు ఎలా ఉండబోతున్నాయి... తొలినాళ్లలో జగన్ పడిన కష్టాల వెనుక ఉన్న వ్యూహాలను ఎలా వివరించబోతున్నారను అనేదానిపైనే తీవ్ర ఆసక్తినెలకొందని అంటున్నారు. ఈ సమయంలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... ఈనెల 23న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభమవుతుందని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా... ఈ ఈవెంట్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ లో ప్రస్తావించారు. ఇదే తనవైపు నుంచి ఆ ముగ్గురికీ హృదయపూర్వక ఆహ్వానం అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్ అయ్యింది!

కాగ... వ్యూహం సినిమాలో వైఎస్‌ జగన్‌ పాత్రను తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హల్ చల్ చేస్తుండగా... ఈ నెల 29న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.