Begin typing your search above and press return to search.

తేజు సరసన ఊహించని హీరోయిన్

అనౌన్స్‌మెంట్ తర్వాత సౌండ్ లేని ఈ సినిమా నుంచి కొత్తగా ఓ అప్‌డేట్ వచ్చింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 7:48 AM GMT
తేజు సరసన ఊహించని హీరోయిన్
X

బ్రో మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ ఆ గ్యాప్ అనుకోకుండా చాలా పెద్దదైపోయింది. ఏడాది పాటు కెమెరా ముందుకే రాలేదు. గతంలో యాక్సిడెంట్ వల్ల చాలా గ్యాప్ రాగా.. ఇప్పుడు ఈ అనుకోని విరామం వచ్చింది. ఐతే యాక్సిడెంట్ తాలూకు సమస్యలు కొన్ని కొనసాగుతుండడంతో పూర్తిగా కోలుకోవడానికి ఈ టైం బాగానే ఉపయోగపడి ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’తో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న తేజు.. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రోహిత్ అనే కొత్త దర్శకుడితో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ తర్వాత సౌండ్ లేని ఈ సినిమా నుంచి కొత్తగా ఓ అప్‌డేట్ వచ్చింది.

ఈ మూవీలో తేజు సరసన నటించబోయే కథానాయిక ఎవరో వెల్లడైంది. మలయాళ భామ ఐశ్వర్యా లెక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషించబోతోంది. తేజు పక్కన ఈమెను ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆమె అసలు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ చర్చల్లోనే లేదు. గట్టా కుస్తీ, పొన్నియన్ సెల్వన్ లాంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఐశ్వర్య. వాటితో పాటు తెలుగులో నేరుగా ‘బ్లఫ్ మాస్టర్’ అనే చిన్న సినిమా చేసింది. తెలుగులో గుర్తింపు తక్కువే కానీ.. తమిళం, మలయాళంలో మాత్రం ఐశ్వర్యకు మంచి పేరుంది. ఆమె సాయిపల్లవి ప్రధాన పాత్రలో ‘గార్గి’ లాంటి సెన్సేషనల్ మూవీని ప్రొడ్యూస్ చేయడం విశేషం. మంచి నటిగా, అభిరుచి ఉన్న నిర్మాతగా పేరున్న ఐశ్వర్యను తేజు సరసన కథానాయికగా తీసుకోవడం ఆసక్తి రేకెత్తించే విషయమే. బహుశా పాన్ ఇండియా మూవీ కాబట్టి దక్షిణాదిన అందరికీ తెలిసిన ఐశ్వర్య అయితే మార్కెటింగ్‌కు బాగుంటుందని భావించి ఉండొచ్చు. తేజు కెరీర్లోనే అత్యధికంగా, దాదాపు వంద కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది.