Begin typing your search above and press return to search.

పవన్ × కార్తీ.. మధ్యలో సూర్య ఎందుకు వచ్చినట్లు?

తిరుమల లడ్డు కల్తీ ఘటనపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన విషయం విదితమే.

By:  Tupaki Desk   |   25 Sep 2024 6:04 AM GMT
పవన్ × కార్తీ.. మధ్యలో సూర్య ఎందుకు వచ్చినట్లు?
X

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు కల్తీతో అపచారం జరిగిందని ప్రభుత్వం తరపున ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. దీంతో పాటు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాట్లు చేయాలని కొత్త డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. తిరుమల లాంటి ఘటనలు దేశంలో ఏ ఇతర దేవాలయాలలో పునరావృత్తం కాకుండా ఉండాలంటే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటుతోనే సాధ్యం అని బలంగా తన వాయిస్ ని వినిపిస్తున్నారు.

హిందుత్వ సంఘాలు పవన్ కళ్యాణ్ కి ఈ విషయంలో మద్దతుగా నిలిచాయి. తిరుమల లడ్డు కల్తీ ఘటనపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన విషయం విదితమే. నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అలాగే హీరో కార్తీ ‘సత్యం సుందరం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్. దాని గురించి మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ మాట్లాడారు. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డుపై ఇలా కామెడీ చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు.

వెంటనే కార్తీ ట్విట్టర్ లో తన మాటలపై పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిపై తనకి అపారమైన భక్తి ఉందని, సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని కార్తీ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై హీరో సూర్య ప్రొఫైల్ తో ఒక ట్వీట్ వచ్చింది. నా తమ్ముడు మూవీ ఈవెంట్ లో లడ్డు గురించి చేసిన కామెంట్స్ కి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నా తమ్ముడు చేసిన వ్యాఖ్యలపై ప్రాయశ్చిత్తంగా నేను కూడా మూడు రోజులు దీక్ష చేస్తాను అంటూ ట్వీట్ వచ్చింది.

ఈ ట్వీట్ ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ లైవ్ లో కూడా టెలికాస్ట్ చేయడం గమనార్హం. అయితే ఇది ఫేక్ ప్రొఫైల్ నుంచి వచ్చిందని తరువాత అందరూ గ్రహించారు. సూర్య పేరుతో పవన్ కళ్యాణ్ దీక్షపై వ్యంగ్యంగా ఈ పోస్ట్ పెట్టారని అర్ధమైంది. కార్తీ కోరిన క్షమాపణలపై పవన్ కళ్యాణ్ తిరిగి స్పందించారు. మీరు ఎలాంటి దురుదేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని అర్ధం చేసుకున్నాను. అయిన కూడా నటులుగా మనం మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

అలాగే ట్వీట్ లో ‘సత్యం సుందరం’ సినిమా రిలీజ్ సందర్భంగా కార్తీ, అరవింద్ స్వామితో పాటు నిర్మాత సూర్య,దర్శకుడు ప్రేమ్ కుమార్ కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తన సినిమాకి అభినందనలు తెలియజేయడంతో అఫీషియల్ గా సూర్య తన ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.