Begin typing your search above and press return to search.

గుండెపోట్లను నివారించడానికి ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం!

ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Aug 2023 10:00 AM GMT
గుండెపోట్లను నివారించడానికి ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం!
X

ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడంతోపాటు దానికింద అందించే చికిత్సలను దాదాపు 3 వేలకు పెంచారు. అలాగే కొత్త 108 వాహనాలతోపాటు 104 వాహనాలను కూడా ప్రారంభించారు. మండలానికి ఒక 108, 104 వాహనాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే నాడు – నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకల వసతులను కల్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శా­తం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయని వెల్లడైంది. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం.

ఇప్పుడు చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఆకస్మిక మరణాలకు కారణమవుతున్న గుండెపోట్లను నివారించడంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్‌ సేవలను మరింతగా పెంచి, ప్రజలకు చేరువ చేయాలని జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీ­ణుల­కు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ‘‘స్టెమీ’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

ఎస్‌టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ ఫారక్షన్‌ (స్టెమీ)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటుకు గురయినవారికి గోల్డెన్‌ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందజేస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. స్టెమీని ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

ఇక రెండో దశ పైలెట్‌ ప్రాజెక్టును సెప్టెంబర్‌ 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంల్లో అమలు చేస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి స్టెమీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోపు 11 పాత బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్‌ (సీటీవీఎస్‌) విభాగాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్‌ లాబ్, సీటీవీఎస్‌ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో ఇప్పటికే క్యాథ్‌ లాబ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.

గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటునే స్టెమీ అంటారు. దీనికి గురైన బాధితుడికి వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్‌ ఇంజక్షన్‌)ను ఇవ్వగలిగితే ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే నగరాలకు దూరంగా గ్రా­మీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ చికిత్స అందుబాటులో లేదు. దీంతో సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి ప్రభు­త్వం స్టెమీ పేరుతోనే కార్యక్రమాన్ని చేపట్టింది.

సెప్టెంబరులో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లలోని హబ్‌ల ద్వారా స్టెమీ ప్రారంభిస్తారు. వీటికి ఆ జిల్లాల పరిధిలోని 48 స్పోక్స్‌ (ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులు)ను అనుసంధానం చేసి సామాన్యులు, గ్రామీణులకు హార్ట్‌ కేర్‌ సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ఛాతీనొప్పి, గుండెపోటు లక్షణాలతో స్పోక్స్‌­కు వచ్చిన వారికి వెంటనే టెలీ–ఈసీజీ తీస్తారు. ఈ ఫలితం హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. గుండె రక్తనాళం ఎంతశాతం పూడిపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్‌ అవసరమా అనేది కార్డియాలజిస్ట్‌ నిర్ధారిస్తారు. వెంటనే స్పోక్‌ వైద్యుడికి తగిన సూచనలు చేస్తారు. అవసరమైతే రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్‌ ఇంజక్షన్‌ ఉచితంగా బాధితులకు ఇస్తారు. ఇదంతా 40 నిమిషాల్లోనే జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఆ తర్వాత తదుపరి చికిత్స కోసం హబ్‌కు లేదా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారు.