Begin typing your search above and press return to search.

అబిడ్స్ గ్రాండ్ హోటల్ అరాచకం మామూలుగా లేదుగా?

ఆదివారం రాత్రి హైదరాబాద్ అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ ఘనకార్యం ఇప్పుడు షాకిచ్చేలా మారింది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:35 AM GMT
అబిడ్స్ గ్రాండ్ హోటల్ అరాచకం మామూలుగా లేదుగా?
X

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనానికి వెళ్లిన ఒక కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. తాము ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ ఉడకలేదన్న ఫిర్యాదుకు సదరు హోటల్ యాజమాన్యం స్పందించిన తీరు షాకింగ్ గా మారింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ ఘనకార్యం ఇప్పుడు షాకిచ్చేలా మారింది.

కస్టమర్లను కర్రలతో బాదుతూ.. దాడి చేసిన ఉదంతంలో ఒకరి తల పగలగా.. మరొకందరు గాయపడ్డారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం డిసెంబరు 31న రాత్రి చోటు చేసుకుంది. అయితే.. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా వ్యవహరించటంతో సోమవారం సాయంత్రం వరకు విషయం బయటకు రాకపోవటం గమనార్హం. చివరకు టీవీ చానల్లలో బ్రేకింగ్ న్యూస్ వేయటంతో ఈ విషయం బయటకు వచ్చి.. షాక్ కు గురి చేసింది.

దూల్ పేటకు చెందిన గంగా బౌలి ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు డిసెంబరు 31న రాత్రి సరదాగా బిర్యానీ తినేందుకు అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ కు వెళ్లారు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ తీసుకొచ్చిన బిర్యానీ సగమే ఉడికి ఉండటంతో.. దీన్ని ఎలా తింటామని ప్రశ్నించారు. తినేందుకు నో చెప్పారు. దీంతో.. వెయిటర్లు మళ్లీ దాన్ని వంట గదికి తీసుకెళ్లి.. వేడి చేసి తీసుకొచ్చారు. దాన్ని తినాల్సిందిగా కోరారు.

సగం ఉడికిన బిర్యానీ సర్వ్ చేశారు కాబట్టి.. డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. ఆగ్రహించిన వెయిటర్లు కర్రలతో దాడి చేశారు. అనూహ్య రీతిలో జరిగిన దాడికి హోటల్ కు వచ్చిన కస్టర్లు భయాందోళనలకు గురయ్యారు. మహిళల అరుపులు.. పిల్లల ఏడుపుతో అక్కడి ప్రాంతం భయానకంగా మారింది. తమపై దాడికి పాల్పడిన వైనంపై బాధితుడు సుమిత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై కాస్తంత ఆలస్యంగా పోలీసులు స్పందించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆరుగురు వెయిటర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరికి గాయాలు కాగా.. వారిలో ఒకరి తల పగిలినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.