Begin typing your search above and press return to search.

అమరావతిలో పని మొదలుపెట్టిన బాబు... ఇక వెలుగులే!

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతే ఉంటుందనే విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jun 2024 6:24 AM GMT
అమరావతిలో పని మొదలుపెట్టిన బాబు...  ఇక వెలుగులే!
X

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతే ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రజానికం కూడా అమరావతికే మద్దతు పలికారు. విశాఖలో వైసీపీ గెలుచుకున్న సీట్లే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రజలు ఇచ్చిన భారీ సపోర్ట్ తో అమారావతి విషయంలో చంద్రబాబు అప్పుడే పనులు మొదలుపెట్టేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ముందుగా నిరంతర వెలుగుపై దృష్టిపెట్టారు!

అవును... కూటమి అధికారంలోకి వస్తే అమారావతే రాజధాని అనే విషయాన్ని చంద్రబాబు బలంగా నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీలో కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా... టీడీపీ సర్కార్ అమరావతిలో పనులు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... అంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు ప్రారంభించారని తెలుస్తుంది.

వాస్తవానికి 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అమరావతిలో సచివాలయం, హైకోర్టు, ఎయిమ్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉండటం వల్ల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ప్లాన్స్ చేశారు. దీనికోసం 33 కేవీ సబ్ స్టేషన్లు 20 నిర్మించి, వాటి నుంచి 440 వోల్టుల విద్యుత్ సరఫరా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే... 2019లో ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి.

అయితే తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో... ఈ పనులు తిరిగి మొదలుపెడుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ప్రతీ సబ్ స్టేషన్ నూ రెండు నుంచి మూడు 33 కేవీ లైన్లతో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ సంస్థలతో పాటు గృహ వినియోగాలకూ నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండనుంది.

మరోపక్క ఎయిమ్స్‌ వద్ద ఉన్న సబ్ స్టేషన్ నుంచి 33 కేవీ లైన్ ద్వారా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఒకవేళ ఈ లైన్లలో ఇబ్బందులు తలెత్తితే జనరేటర్ ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొండవీటి వాగు కేంద్రం నుంచి నేరుగా ఉండవల్లి సబ్ స్టేషన్ కు 33 కేవీ లైన్ వేయాలని నిర్ణయించారని తెలుస్తుంది. ఫలితంగా సీఎం ఇంటివద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు!