Begin typing your search above and press return to search.

ప్రపంచ పోకడ నచ్చక... అమెరికాలో దారుణం!

చివరికి కొలరాడోలో కఠినాతి కఠినమైన పరిస్థితులకు తాళలేక పస్తులుండి కన్నుమూశారు!

By:  Tupaki Desk   |   28 July 2023 7:07 AM GMT
ప్రపంచ పోకడ నచ్చక... అమెరికాలో దారుణం!
X

ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లి బ్రతకాలనిపిస్తోంది... ఈ మాట రెగ్యులర్ గా వినిపిస్తంటోంది. చాలా సందర్భాల్లో చాలా మంది ఈ మాట అంటుంటారు. ప్రస్తుతం ఈ కష్టాలు, ఈ మనుషుల మనస్తత్వాలూ, ఈ సమస్యలూ అన్నీ చూస్తుంటే... ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్లి బ్రతకాలనిపిస్తోంది అని అనడం సహజం!

అయితే అలా మాటల్లో అనడం కాదు చేతల్లో చేసి చూపించారు కొంతమంది అక్కాచెల్లెల్లు. అయితే పక్కా ప్లానింగ్ లేకపోవడంతో వారి ఆలోచన విషాదాంతమైంది. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఈ సందర్భంగా గన్నిసన్ కౌంటీ పోలీసు అధికారులు వివరాలు వెళ్లడిస్తోన్నారు.

అవును... ప్రపంచ పోకడ నచ్చక జనాల ఉనికంటూ లేని ప్రదేశానికి వెళ్లి బ్రతకాలనుకున్నారు అమెరికాలోని ఒకకుటుంబంలోని అక్కాచెల్లెల్లు. వారిద్దరితో పాటు వారిలో ఒకరి కుమారుడిని కూడా వెంటతీసుకుని దూరంగా వెళ్లిపోవాలనుకున్నారు. ఇందులో భాగంగా.. ప్రపంచానికి దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిపోయారు.

చివరికి కొలరాడోలో కఠినాతి కఠినమైన పరిస్థితులకు తాళలేక పస్తులుండి కన్నుమూశారు! గన్నిసన్ కౌంటీ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతులను క్రిస్టీన్ వాన్స్(41), రెబెక్కా వాన్స్(42), రెబెక్కా వాన్స్ కుమారుడు(14) గా గుర్తించారు.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... కొలరాడోలోని ఓహియో సిటీకి 14 కిలోమీటర్లకు దూరంలో వీరు దయనీయ స్థితిలో చనిపోయి ఉన్నారని తెలిపారు. ఆకలి బాధలకి తాళలేక ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోయి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వీరి బంధువులను ఆరాతీసిన అధికారులకు ఈ విషయాలు వెళ్లడించారు. చారణలో భాగంగా రెబెక్కా వాన్స్ బంధువుల్లో ఒకరు... రెబెక్కాకు ప్రపంచం తీరు నచ్చేది కాదని.. తనతోపాటు క్రిస్టీన్ ను తన కుమారుడిని కూడా జనజీవన స్రవంతికి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లి ఒంటరిగా జీవించాలని చెప్తూ ఉండేదని తెలిపారు.

ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లి బ్రతకడమెలా అని యూట్యూబ్ వీడియోలు చూసి అరకొర అవగాహనతో నిర్ణయం తీసుకున్నారని.. దీంతో... నిర్మానుష్య ప్రాంతానికి సరైన సిద్ధపాటు లేకుండా వెళ్లిపోయారని.. ఫలితంగా దయనీయంగా మృతి చెందారని చెప్పుకొచ్చారు.

అయితే వీరు గతేడాది వేసవిలోనే ఈ క్యాంప్ స్టార్ట్ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది శీతాకాలంలోనే చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.. ఈ సందర్భంగా... రెండు మృతదేహాలు ఒక గుడారంలో, మరొకటి బయట 9,500 అడుగుల ఎత్తులో కనిపించాయని అధికారులు చెబుతున్నారు.

మృతదేహాలతో క్యాంప్‌ సైట్‌ పరిధిలో ఎటువంటి వాహనం, తుపాకీల ఆనవాల్లను అధికారులు కనుగొనలేదు. దీంతో తీవ్రమైన చలి వాతావరణానికి తట్టుకోలేక మృతి చెంది ఉంటారని ఆధికారులు అనుమానిస్తున్నారు.

దీంతో... పాపం ప్రపంచానికి దూరంగా బ్రతకాలని నిర్ణయించుకున్న వారు... ఏకంగా ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయారని సంతాపం తెలియజేస్తున్నారట బందువులు!