Begin typing your search above and press return to search.

ఆంధ్రాలోనూ హైడ్రా.. కూల్చివేతలు అక్కడి నుంచే!

ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:21 AM GMT
ఆంధ్రాలోనూ హైడ్రా.. కూల్చివేతలు అక్కడి నుంచే!
X

ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు సంరక్షణే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన హైడ్రా వరుస కూల్చివేతలతో దూకుడు కొనసాగిస్తోంది. చెరువులను, నాళాలను, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు సాగించినవారి భర తం పడుతోంది. తన తరతమ బేధం లేకుండా చెరువులను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూలగొడుతోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రాలోనూ హైడ్రాలాంటి వ్యవస్థను తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో నదులు, కాలువలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూల్చివేస్తామని ఇప్పటికే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు కార్యాచరణ ప్రణాళిక చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు.

ముఖ్యంగా ఇటీవల బుడమేరు వరదలతో విజయవాడ నగరం నీట మునిగింది. లక్షల మంది ప్రజలు కొన్ని రోజులపాటు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా సంభవించాయి.

బుడమేరు కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణమని.. బుడమేరు ప్రవాహానికి మార్గం లేకుండా చేయడంతో భారీ వర్షాలకు అది ఉప్పొంగిందని అంటున్నారు. ఆ నీరు కాలువలోకి పోయే మార్గం లేక జనావాసాలను చుట్టుముట్టిందని తేలింది.

ఈ నేపథ్యంలో బుడమేరు నుంచే ఏపీ ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని మొదలుపెట్టనుంది తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు పరిశీలన కూడా చేశారు. బుడమేరు మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఎన్ని ఎకరాల్లో బుడమేరు కబ్జాకు గురయింది. అక్రమ నిర్మాణాలెన్ని, ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు వంటి వివరాలను కూడా అధికారులు సేకరించారు. ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే ఎంతమంది ప్రజలు నిర్వాసితులవుతారో కూడా నివేదిక రూపొందించారు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి దారుణ పరిస్థితులు సంభవించకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికే బుడమేరు ప్రాంతంలో అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నవారికి వేరే చోటకు తరలిస్తారని తెలుస్తోంది. అలాగే వారికి టిడ్కో గృహాల్లో నివాస వసతి కల్పిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత అక్రమ నిర్మాణాల భరతం పడతారని అంటున్నారు.