Begin typing your search above and press return to search.

ముంబై నటికి వేధింపులు... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఏపీ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరీ జత్వానీకి వేధింపుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Aug 2024 10:46 AM GMT
ముంబై నటికి వేధింపులు... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

ఏపీ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరీ జత్వానీకి వేధింపుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఆమెను చిత్రహింసలకు గురి చేశారని.. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా తప్పుడు కేసులు బనాయించారని.. ఈ విషయంలో అధికారులు, పెద్దపెద్ద తలకాయలే ఉన్నాయంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో... ఈ విషయంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. పైగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దల పేర్లతో పాటు పలువురి పోలీసు అధికారుల హస్తం ఉందంటూ మీడియాల్లో కథనాలు రావడంతో ఇష్యూ వైరల్ గా మారింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. సంచలన నిర్ణయం తీసుకుంది.

అవును... ముంబై నటి కాదాంబరీ జత్వానీకి వేధింపుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇందులో భాగంగా పోలీసులపై ఆమె నుంచి తీవ్ర ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో... ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే... ఆమెతో ఆన్ లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులకు ఏపీ సర్కార్ నుంచి ఆదేశాలు అందాయి!

దీంతో.. ఈ కేసుకు సంబంధించి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారని అంటున్నారు. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో.. దర్యాప్తులో భాగంగా ఏపీలో పోలీస్ టీమ్ ముంబై వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో... ఈ కేసులో ఎలాంటి సంచలనాలు వెలుగులోకి రాబోతున్నాయనేది తీవ్ర ఆసక్తిగా మారింది.

కాగా... తాజాగా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన కాదంబరీ జత్వానీ కన్నీటి పర్యంతమవుతూ పలు కీలక విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ పోలీసు అధికారులు తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఈ క్రమంలో కిడ్నాప్ చేసి కృష్ణాజిల్లాలోని ఓ గెస్ట్ హౌస్ లో బంధించారని.. తన ఇంట్లోకి రొరబడి భయబ్రాంతులకు గురిచేశారని ఆమె వాపోయారు.

ఇదే క్రమంలో తన ఇంటిని, బ్యాంక్ అకౌంట్స్ ను సీజ్ చేసి వేధించారని.. దీంతో రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి కల్పించారని చెప్పారు. తన నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అందులో ఉన్న ఆధారాలన్నింటినీ ట్యాంపర్ చేశారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే... తనను, తన కుటుంబాన్ని హింసించి, వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత లు తనకు న్యాయం చేయాలని ఆమె విన్నవించారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఏపీ ప్రభుత్వం... ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది! దీంతో... ఈ వ్యవహారంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.