'వాట్సాప్ పాలన'పై సంతృప్తి ఎంతంటే...!
ఏపీలో కూటమి సర్కారు విజన్ పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు విజన్-2047 మంత్రం తో ముందుకు సాగుతున్నారు.
By: Tupaki Desk | 2 Feb 2025 11:30 PM GMTఏపీలో కూటమి సర్కారు విజన్ పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు విజన్-2047 మంత్రం తో ముందుకు సాగుతున్నారు. పెట్టుబడులు, వృద్ధి, ఆదాయం, ఉపాధి కల్పన దిశగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నె న్స్ పేరుతో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా.. ప్రజలకు అరచేతిలోనే పాలననుఅందించాలన్న సంకల్పంతో రెండు రోజుల కిందట దీనిని ప్రారంభించారు.
ఈ వాట్సాప్ పాలన పూర్తిగా మంత్రి నారా లోకేష్ వ్యూహం, ఆలోచన మేరకు తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు సైతం చెప్పుకొచ్చారు. దీనిని మంత్రి నారా లోకేషే ప్రారంభించారు. ప్రత్యేకంగా ఫోన్ నెంబ రును కూడా తీసుకువచ్చారు. దీని ద్వారా ఏకంగా తొలిదశలో 161 సేవలను పొందవచ్చని సూచించారు. వీటిలో ప్రధానంగా ఆలయాల దర్శనాలు, సేవలకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల టికెట్లను కూడా బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు.
గడిచిన రెండు రోజుల్లో ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రజలు విరివిగానే వాట్సాప్ పాలనను విని యోగించుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. సుమారు 2 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ టికెట్లు, దేవాలయాల టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇక, పౌర సేవలకు సంబంధించి బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆశించిన విధంగా సాగలేదు. ఈ విషయంలో కొంత గందరగోళం నెలకొందని తెలుస్తోంది. రెవెన్యూ, మునిసిపాలిటీల మధ్య ఆర్థిక పరమైన సంబంధాలు లేకపోవడంతో బిల్లుల చెల్లింపు ప్రక్రియ బెడిసి కొట్టింది.
ఇక, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్యా సంబంధమైన పత్రాలను డౌన్లోడ్ చేసుకునే అంశం కూడా.. ప్రచారానికి నోచుకోవాల్సి ఉంది. వాట్సాప్ పాలనలో విస్తృతమైన.. వివరాలు నమోదు చేయాల్సి రావడం కొంత చిక్కుగా ఉండడంతో సమయం తినేస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. సులువుగా వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వాట్సాప్ పాలనపై సంతృప్తి బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే.. మరింత సక్సెస్ అయ్యేందుకు కనీసం 15 నుంచి నెల రోజుల సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు.