Begin typing your search above and press return to search.

లండన్ కు వెళ్లిన జగన్ దంపతులు.. తిరిగి వచ్చేదెప్పుడంటే?

ప్రతి ఏడాది పిల్లల కోసం విదేశీ పర్యటన చేయటం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటే

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:42 AM GMT
లండన్ కు వెళ్లిన జగన్ దంపతులు.. తిరిగి వచ్చేదెప్పుడంటే?
X

ప్రతి ఏడాది పిల్లల కోసం విదేశీ పర్యటన చేయటం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటే. సతీసమేతంగా విదేశాలకు వెళ్లే ఆయన.. శనివారం రాత్రి పది రోజుల పర్యటనకు వెళ్లారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన లండన్ బయలుదేరి వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు నుంచి.. కేంద్రం నుంచి అనుమతులు రావటం తెలిసిందే. సెప్టెంబరు 12న తన విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని తాడేపల్లికి చేరుకుంటారని చెబుతున్నారు.

వైఎస్ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్.. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి.. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో లండన్ కు బయలుదేరి వెళ్లారు. ఆయనకు ఎయిర్ పోర్టులో పలువురు మంత్రులు.. ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. ఇంతకూ ఆయన లండన్ కు ఎందుకు వెళ్లినట్లు? అంటే.. తన ఇద్దరు కుమార్తులతో కలిసి గడిపేందుకని చెబుతున్నారు. జగన్ కుమార్తెల్లో పెద్ద కుమార్తె హర్షా రెడ్డికి అకడమిక్స్ పరంగా మంచి ట్రాక్ రికార్డు ఉందని చెబుతారు.

నిజానికి ఇద్దరు పిల్లలకు సంబంధించిన వివరాలు బయటకు రావు. వారిద్దరిని వారి ప్రైవేటు జీవితాలకే పరిమితం అయ్యేలా వ్యవహరిస్తుంటారు. 2017లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. అమెరికాలోని ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ జాబ్ కు ఎంపికయ్యారు. ప్రపంచంలోనే టాప్ ఫైవ్ బిజినెస్ స్కూల్స్ లో ఒకటిగా పేరున్న ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆమె ఫైనాన్స్ లో ఎమ్మెల్సీ పూర్తి చేశారు. అక్కడా డిస్టింక్షన్ లో పాస్ కావటం తెలిసిందే. ఆమె గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా గత ఏడాది జగన్ దంపతులు జులై రెండున పారిస్ కు వెళ్లటం తెలిసిందే.

ఇక.. చిన్న కుమార్తె విషయానికి వస్తే.. లండన్ లోని కింగ్స్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు వర్షా రెడ్డి. గతంలో ఆమె అమెరికాలో చదువుకున్నా.. ఇప్పుడు మాత్రం లండన్ లోనే ఉంటున్నారు. దీంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి వారం గడిపేందుకు వీలుగా పదిరోజుల లండన్ ట్రిప్ ను ప్లాన్ చేసుకున్నారని చెప్పాలి.