Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రధాన పార్టీలకు కొత్త టెన్షన్.. కౌంటింగ్ వ్యూహాలకు పదును

పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య దాదాపు మూడు వారాల దూరం ఉండటంతో కాస్తంత నిదానించిన పార్టీలు.. నేతలు ఇప్పుడు మళ్లీ అలెర్టు అవుతున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2024 4:51 AM GMT
ఏపీలో ప్రధాన పార్టీలకు కొత్త టెన్షన్.. కౌంటింగ్ వ్యూహాలకు పదును
X

ఏడు దశల్లో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లోక్ సభ.. శాసన సభ ఎన్నికలు జరిగాయి. మే 13న కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యింది. గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పోల్ జరిగిన నేపథ్యంలో తుది ఫలితంపై ప్రధాన పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని అంచనా వేస్తున్నాయి. దీంతో.. ఎవరికి వారు ఆశాభావంతో ఉంటున్నారు.

జూన్ 4న కీలకమైన కౌంటింగ్ తో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. చివర్లో జరిగే కౌంటింగ్ మరో ఎత్తు అన్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండని పక్షంలో ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. కౌంటింగ్ కోసం కొత్త కసరత్తు మొదలు పెట్టారు. దీంతో పార్టీలకు కౌంటింగ్ టెన్షన్ మొదలైంది.

పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య దాదాపు మూడు వారాల దూరం ఉండటంతో కాస్తంత నిదానించిన పార్టీలు.. నేతలు ఇప్పుడు మళ్లీ అలెర్టు అవుతున్నారు. పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలు ఎంతమేర అమలు చేశామన్న దానిపై సమీక్షలు జరుపుకుంటూ.. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

పోలింగ్ వేళ ఏపీలోని పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని జిల్లాల్లో హింసాత్మక చర్యలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కీలకంగా మారింది. ఎన్నిలక పలితాల్ని డిసైడ్ చూసే కౌంటింగ్ వేళ.. నియమించుకునే ఏజెంట్లు ఏ తీరులో వ్యవహరించాలన్న దానిపై పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి? ఎలా రియాక్టు కావాలి? అన్న దానిపై ఎత్తుగడలను సిద్దం చేసుకుంటున్న పార్టీలు అందుకు తగ్గట్లుగా తమ సైన్యాన్ని సిద్దం చేస్తున్నాయి.

ఇంతకాలం పోలింగ్ టెన్షన్ లో ఉన్న నేతలు.. అభ్యర్థులు.. మద్దతుదారులు ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్ కు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో తక్కువ మెజార్టీలతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. కౌంటింగ్ కీలకంగా మారనుంది. పోలింగ్ పూర్తి అయిన రెండు.. మూడు రోజులకే పలువురు అభ్యర్థులు విహారయాత్రలకు వెళ్లటం తెలిసిందే. అధినేతలు సైతం విదేశీ టూర్లకు వెళ్లారు.

కౌంటింగ్ కు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో క్యాడర్ ను సమాయుత్తం చేసుకోవటం కూడా నేతలు రంగంలోకి దిగారు. బయట ప్రాంతాల్లో ఉన్న వారిని కౌంటింగ్ కు ఒకట్రెండు రోజుల ముందే రావాలని కోరుతున్నారు. పోలింగ్ వేళ అంత భారీగా కాకున్నా.. ముఖ్యమైన క్యాడర్.. కౌంటింగ్ వేళ అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. దీంతో.. మొన్నటి దాకా టెన్షన్ నెలకొన్న స్థానే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అటెన్షన్ మొదలైంది.