Begin typing your search above and press return to search.

తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం!

ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్‌ లో ఉన్న ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 7:57 AM GMT
తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం!
X

ఇది తెలుగువారందరూ గర్వించే సందర్భం. తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్‌ కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఐక్యరాజ్యసమితిలో భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 సంవత్సరం ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) బ్యాచ్‌ కు చెందిన ఆయన ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్‌ లో ఉన్న ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వతనేని హరీశ్‌ న్యూయార్క్‌ లోని ఐక్యరాజ్య సమితిలో భారత తదుపరి రాయబారి/ శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 క్యాడర్‌ ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌ కు చెందిన హరీశ్‌.. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంబోజ్‌ ఈ ఏడాది జూన్‌ లో పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో పర్వతనేని హరీశ్‌ ను ఆ పోస్టులో నియమించారు.

ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా ఉన్న పర్వతనేని హరీశ్‌ 2021 నవంబర్‌ 6 నుంచి ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

పర్వతనేని హరీశ్‌ హైదరాబాద్‌ లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అభ్యసించారు. ఆ తర్వాత ప్రఖాత్య ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ (ఐఐఎం) –కోల్‌ కతాలో ఎంబీఏ చదివారు.

ఎంబీఏ పూర్తయ్యాక కొన్నాళ్లు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసిన పర్వతనేని హరీశ్‌ ఆ తర్వాత సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాశారు. ఇండియన్‌ ఫారెస్‌ సర్వీసు (ఐఎఫ్‌ఎస్‌) కు ఎంపికయ్యారు. అప్పటి నుంచి విదేశీ వ్యవహారాల శాఖలోనే పనిచేస్తున్నారు. అదనపు కార్యదర్శి సహా అనేక కీలక పదవులను చేపట్టారు.

ఈజిప్టు, సౌదీ అరేబియాల్లో రాయబారిగా పనిచేశారు. పాలస్తీనాలోని గాజాలో భారత ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 2007–2012 మధ్య భారత ఉపరాష్ట్రపతికి కార్యదర్శిగా పనిచేశారు. వియత్నాంలో 2016 నుంచి 2019 వరకు భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు.