Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ మాగుంట మీద కేజ్రీవాల్ సతీమణి ఫైర్ !

దాంతో ఆ స్టేట్మెంట్ తన భర్త మెడకు చుట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   6 July 2024 4:41 PM GMT
టీడీపీ ఎంపీ మాగుంట మీద కేజ్రీవాల్ సతీమణి ఫైర్ !
X

ఆయన ఆ మధ్య దాకా వైసీపీ ఎంపీ, తాజా ఎన్నికల్లో టీడీపీ ఎంపీ. ఆయనే ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు. ఆయన మీద ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ సతీమణి సునీత ఫైర్ అవుతున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే తన భర్త ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

దీని వెనక అతి పెద్ద రాజకీయ కుట్ర దాగుందని అన్నారు. తన కుమారుడు రాఘవను కాపాడుకునేందుకే మాగుంట ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని సునీత అన్నారు. దాంతో ఆ స్టేట్మెంట్ తన భర్త మెడకు చుట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త నిజాయతీపరుడు అని ఆమె అన్నారు. తన భర్తకు మద్దతుగా ప్రజలు ముందుకు రాకపోతే రానున్న రోజులలో చదువుకున్న వారు ఎవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసించరని ఆమె అన్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ ఎంపీగా గెలిచి పసుపు పారాణి కాళ్ళకు ఆరక ముందే మాగుంట మీద ఈ ఆరోపణలు రావడం అంటే ఇబ్బందికరమే అని అంటున్నారు. అప్పట్లో మాగుంట కుమారుడు రాఘవను లిక్కర్ స్కాం లో అరెస్ట్ చేశారు అది కాస్తా మాగుంట ఫ్యామిలీ మొత్తానికి చుట్టుకుంటుందని కూడా ఒక దశలో భావించారు

మరి ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ లిక్కర్ స్కాం కేసు కొత్త మలుపులు తిరిగింది. రాఘవకు బెయిల్ దక్కింది. మాగుంట పార్టీ మారి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఆయన కొత్త పార్లమెంట్ లో సభ్యుడిగా ఉన్నారు.

టీడీపీ అధికార కళ చూస్తే ఏపీలో కేంద్రంలో నిఖార్సుగా కనిపిస్తోంది. అలా పవర్ ఫుల్ పార్టీలో పవ్ర్ ఫుల్ ఎంపీగా ఉన్న మాగుంట మీద ఈ తరహా ఆరోపణలు రావడం విశేషం. మరి ఆయన దీనికి ఏ విధంగా స్పందిస్తారు అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరో వైపు చూస్తే గాగుంట టీడీపీలో ఉన్నారు.

దాంతో టీడీపీ కూడా ఈ ఆరోపణలతో ఇరకాటంలో పడినట్లేనా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ జైలు గోడల మధ్యన మగ్గుతున్నారు. ఇది రాజకీయ కుట్ర అని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. అలా బీజేపీ వర్సెస్ ఆప్ కాస్తా ఇపుడు మధ్యలోకి టీడీపీ ఎంపీని తీసుకుని వచ్చారు. మరి ఇదే కీలక మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.