Begin typing your search above and press return to search.

స్నేహాలు వద్దు పెళ్లి చేసుకోమన్న తండ్రిని చంపేసి కూతురు!

ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

By:  Tupaki Desk   |   18 Jun 2024 8:30 AM GMT
స్నేహాలు వద్దు పెళ్లి చేసుకోమన్న తండ్రిని చంపేసి కూతురు!
X

బంధాలు.. అనుబంధాలు అన్నవి ఒకప్పటి గురుతులుగా మారిపోతున్నాయా? రక్తం పంచుకు పుట్టిన వారే కన్నవారి పాలిట మ్రత్యువుగా మారుతున్నారా? అన్న సందేహాలు కలిగేలా ఇటీవల కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివాటి పుణ్యమా అని కొత్త సందేహాలకు తెర మీదకు వస్తున్నాయి. తాజా ఉదంతం గురించి తెలిస్తే షాక్ తినటమే కాదు.. ఇదేం పోయే కాలమన్న భావనకు గురి కాక మానదు. ఆస్తిని కూతురుకు అప్పజెప్పటమేకాదు.. చక్కగా పెళ్లి చేసుకోమ్మా? అనటమే ఆ తండ్రి తప్పైంది. అందుకు ప్రతిగా కన్నతండ్రి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని కఠినాత్మురాలైన ఒక కూతురు ఉదంతమిది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

మదనపల్లెలోని పీ అండ్ టీ కాలనీకి చెందిన 62 ఏళ్ల దొరస్వామి గవర్నర్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఆయన సతీమణి లత అనారోగ్యంతో చనిపోయింది. దీంతో బీఎస్పీ.. బీఈడీ చదివిన ఒక్కగానొక్క కూతురు హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కూతురు పెళ్లి కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో వేశారు. తల్లి నగలను సైతం ఆమెకు అప్పజెప్పాడు.

ఇదిలా ఉంటే హరిత పట్టణానికి చెందిన రమేశ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగల్ని ఇచ్చింది. వాటిని తాకట్టు పెట్టుకున్న అతను రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అదే సమయంలో సాయి క్రిష్ణ అనే మరో యువకుడికి రూ.8 లక్షలు ఇచ్చింది. వీరిద్దరితో కాకుండా హరీశ్ రెడ్డి అనే వ్యక్తితోనూ ఆమె సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయాల్ని తెలుసుకున్న దొరస్వామి.. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావించారు.

ఇందులో భాగంగా పెళ్లి చేసుకోమని చెప్పగా నో చెప్పేసింది హరిత. దీంతో పెళ్లి విషయమై తండ్రి.. కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 13న కోపానికి గురైన హరిత.. తన తండ్రిని ఇంట్లోని చపాతీ కర్రతోనూ.. తాళం కప్పతోనూ.. కర్రతోనూ విచక్షణరహితంగా తల మీద బలంగా కొట్టటంతో తీవ్ర గాయాలపాలైన అతను మరణించాడు.

హత్య జరిగిన రోజు అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా.. తన తండ్రి కాలు జారి కింద పడటంతో గాయాలు అయినట్లుగా హరిత వారికి చెప్పింది. తర్వాత పోలీసులకు అదే విషయాన్ని చెప్పింది. అయితే.. దొరస్వామికి తగిలిన గాయాలు.. అతను పడి ఉన్న తీరుపై సందేహానికి గురైన పోలీసులు హరితను తమదైన రీతిలో ప్రశ్నించగా.. అసలు విషయాన్ని చెప్పేసింది. దీంతో.. ఆమెను రిమాండ్ కు తరలించారు. అనవసర స్నేహాలు వద్దు.. పెళ్లి చేసుకోవాలన్న తండ్రిని కన్నకూతురే కడతేర్చిన వైనం షాకింగ్ గా మారింది.